నిరుద్యోగులే బాబుకు బుద్ధి చెబుతారు

– ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి  
– పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి అట్టహాసంగా నామినేషన్‌
అనంతపురం: ఎన్నికల సమయంలో ఇంటికో ఉద్యోగం ఇస్తామని, నెలకు రెండు వేల రూపాయల నిరుద్యోగ భృతి చెల్లిస్తానని హామీ ఇచ్చి మాట తప్పిన చంద్రబాబుకు నిరుద్యోగులే బుద్ధి చెబుతారని పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గం శాసన మండలి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి హెచ్చరించారు. బుధవారం అనంతపురం నగరంలోని పార్టీ కార్యాలయం నుంచి కలెక్టరేట్‌ వరకు భారీ ప్రదర్శన చేపట్టిన ఆయన ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం అధికారంలోకి రాకముందు 600 అబద్ధాలు చెప్పిందని   విమర్శించారు. రాష్ట్రంలోని యువతి, యువకులకు ఉద్యోగ అవకాశాలు కావాలన్నారు. ఉద్యోగ అవకాశాలు కావాలంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలన్నారు. రైల్వే జోన్‌ రావాలని, స్టీల్‌ ఫ్యాక్టరీ రావాలని ఆకాంక్షించారు. వీటన్నింటి కోసం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పోరాటం చేస్తున్నారని చెప్పారు.
–––––––––––––––
కేంద్రంతో బాబు లాలూచి
–ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌రెడ్డి
 అనంతపురం: చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంతో లాలూచి పడి ఏపీకి రావాల్సిన ప్రత్యేక హోదాను తన స్వార్థం కోసం తాకట్టు పెట్టారని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌రెడ్డి మండిపడ్డారు. గోపాల్‌రెడ్డి నామినేషన్‌ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజనతో ఏపీలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. విభజన చట్టంలో మనకు రావాల్సిన ప్రత్యేక హోదాకు చంద్రబాబు తిలోదకాలు ఇచ్చారని విమర్శించారు. అందుకే టీడీపీని రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు నిలదీస్తున్నారని చెప్పారు. ఈ ఎన్నికల ద్వారా హోదాకు తిలోదకాలు ఇచ్చిన టీడీపీకి వ్యతిరేకంగా పట్టభద్రులు ఉద్యమించాలని, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు.
––––––––––––
బాబు పోతేనే జాబు వస్తుంది
–మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి
అనంతపురం: ఎన్నికల ముందు బాబు వస్తే జాబు వస్తుందని ప్రచారం చేశారని, ఇప్పుడు ఆయన పోతేనే జాబు వస్తుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఎద్దేవా చేశారు. పశ్చిమ రాయలసీమ శాసస మండలి ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థి గోపాల్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని బలపరుస్తున్నారని, ఆయన గెలుపు ఖాయమని రామచంద్రారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
Back to Top