అడ్డదిడ్డంగా తిప్పేద్దామా..!అమరావతి రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్డు నమూనా ను అడ్డదిడ్డంగా తిప్పేసేందుకు తెలుగుదేశం నేతలు స్కెచ్ వేశారు. అమరావతి నుంచి విజయవాడ చుట్టూ తిప్పి గుంటూరు జిల్లాలోని కొంత ప్రాంతాన్ని కలుపుతూ తిరిగి అమరావతి వరకు 75 మీటర్ల వెడల్పుతో నిర్మించే 85 కిలోమీటర్ల దీన్ని నిర్మించనున్నారు. రెండు ఇన్నర్ రింగ్రోడ్లు ఒకే ప్రాంతంలో కలపడం వెనుక అధికారపార్టీ నేతల స్వప్రయోజనం ఉందనేది స్థానికుల వాదన. ఒక రింగ్రోడ్డు రామవరప్పాడు వద్ద కలుస్తున్నప్పుడు రెండో రింగ్రోడ్డును ప్రసాదంపాడు వద్ద కలిపితే ప్రయోజనకరంగా ఉండేదని వారు చెబుతున్నారు. రామవరప్పాడు రింగ్రోడ్డుకు సమీపంలో ఒక దినపత్రిక కార్యాలయ నిర్మాణం జరుగుతోంది. దాని ముందు భాగం నుంచి రామవరప్పాడులో కలుపుతున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. గొల్లపూడి బైపాస్ వద్ద ప్రస్తుత ఇన్నర్ రింగ్రోడ్డుకు, ప్రతిపాదిత ఇన్నర్ రింగ్రోడ్డుకు మధ్య ఆరు కిలోమీటర్ల వరకు దూరం ఉంది. రామవరప్పాడు సమీపానికి వచ్చేసరికి ఒకటిన్నర కిలోమీటరు దూరం మాత్రమే ఉంది. ప్రారంభంలో ఎంత దూరం ఉందో అంతే దూరంతో ఐదో నంబరు జాతీయ రహదారిలో కలిపితే బాగుండేదని, ఎవరి స్వార్థం కోసమో ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం మంచిది కాదనేది పలువురి వాదన. ఇప్పటికే ఇన్నర్ రింగ్రోడ్డు కోసం కొంత భూమిని తీసుకున్నారు. మెట్రో ప్రాజెక్టు కోసం నిడమానూరులో 60 ఎకరాలు డిపోకు తీసుకుంటున్నారు. గన్నవరం ఎయిర్పోర్టుకు ఇప్పటికే కొంత భూమిని ప్రభుత్వం తీసుకుంది. ఇప్పుడు మరో ఇన్నర్ రింగ్రోడ్డు పేరుతో మరికొంత భూమి పోనుంది. ఎవరి కోసమో తాము బలికావాల్సి వస్తోందని భూములు కోల్పోతున్న వారు వాపోతున్నారు. తాడిగడప-ఎనికేపాడు మధ్య ఉన్న 100 అడుగుల రోడ్డుకు ఐఆర్ఆర్ను కలపాలనేది ప్రతిపాదన. అక్కడి నుంచి వీజీటీఎం-ఉడా హయాంలో మొదలైన రామవరప్పాడు రింగ్ వద్ద నిర్మాణంలోని ఐఆర్ఆర్కు కలిపి గొల్లపూడి వరకు తీసుకువెళ్లాలనేది ఆలోచన. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే ఇంతకన్నా అశాస్త్రీయ, అసంబద్ధత మరొకటి ఉండదనేది నిపుణుల అభిప్రాయం. బెజవాడ ఇక అభివృద్ధి చెందదు అనే ఉద్దేశంతోనే ఐఆర్ఆర్ ప్రతిపాదనలు ఉన్నట్లు వారు చెబుతున్నారు.