<br/><br/>అనంతపురం: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి చదువు విప్లవాన్ని సృష్టించారని, ఆయన కొడుకుగా తాను మరో రెండు అడుగులు ముందుకు వేసి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని మెరుగ్గా అమలు చేస్తానని, పేద విద్యార్థులకు అండగా ఉండి చదివిస్తానని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలో తనను కలిసిన విద్యార్థినులతో వైయస్ జగన్ మాట్లాడారు. :‘ ఏమ్మా...ఏం చదువుతున్నారు. బాగా చదవండి. మీరు ఎంత వరకు చదివినా.. మీకు అండగా ఉండి చదివిస్తా’నంటూ వైయస్ జగన్ ఆ విద్యార్థినులకు హామీ ఇచ్చారు. రొళ్ల మండలం జీబీ హళ్లికి చెందిన పదో తరగతి విద్యార్థిని రాధ, తొమ్మిదో తరగతి చదువుతున్న జయశ్రీ ప్రజా సంకల్ప యాత్రలో వైయస్ జగన్ను కలిశారు. ‘మీ బడిలో చదువెలా చెబుతున్నారు? భోజనం నాణ్యతగా ఉంటోందా..? ఏమైనా ఇబ్బందులున్నాయా...అంటూ ఆరా తీశారు. మన ప్రభుత్వం అధికారంలోకొస్తే మీలాంటి విద్యార్థినులందరికీ ఐదో తరగతి వరకు ఒక్కొక్కరికి రూ.500 చొప్పున ఇద్దరికీ రూ.1000 ఇస్తామని, 6 నుంచి 10 వరకు రూ.750 చొప్పున ఇద్దరుంటే రూ.1500 చొప్పున, ఇంటర్ చదివే విద్యార్థినులకు ఒక్కొక్కరికి రూ.1000 చొప్పున అందజేస్తామని తెలిపారు. ఇంకా పై చదువులు చదవడానికి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తానని చెప్పారు.<br/>