రైతాంగ సమస్యలు పరిష్కరించండి..ప్రధానమంత్రికి పొంగులేటి లేఖ

ఖమ్మం: నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంపై కరుణ చూపి, రైతులను ఆదుకోవాలని వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రధానమంత్రి నరేంద్రమోదీకి గురువారం లేఖ రాశారు. దేశంలో ఎన్‌డీఏ ప్రభుత్వం, తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కేవలం 11 నెలలు మాత్రమే గడిచింది. ఇప్పటికే  ఇక్కడ 800 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడినా ప్రభుత్వం రైతాంగంపట్ల చిన్నచూపు చూస్తోందన్నారు.  ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతుల కుటుంబాలను కూడా పట్టించుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరి స్తోందన్నారు. రాష్ట్రంలో సాగునీరు, ఎరువులు, విత్తనాల కొరతతోపాటు సాగుకు సరి పడా విద్యుత్ లేక.. ఆరుగాలం కష్టించి పండించిన పంటలకు గిట్టుబాటు ధర దక్కక.. రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని లేఖలో వివరించారు.

13 ఏళ్లపాటు తెలంగాణ కోసం పోరాటాలు సాగించిన టీఆర్‌ఎస్ కొత్త రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుతుందనే నమ్మకంతోనే రాష్ట్ర ప్రజలు అధికారాన్ని కట్టబెట్టారని, కానీ, ఆది నుంచీ పాలకులు ఇచ్చి న వాగ్దానాలను విస్మరించారని ధ్వజమెత్తారు. అధికారంలోకి రాగానే ప్రతి రైతుకు రూ.లక్ష రుణమాఫీ చేస్తామన్న కేసీఆర్ ఇప్పటివరకు అరకొరగా రుణాలు మాఫీ చేసి.. కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో మొత్తం 2,24,544 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని, అందులో 1,39,512 ఎకరాల్లో వ్యవసాయ పంటలు, 85,032 ఎకరాల్లో ఉద్యానవన పంటలు నష్టపోయినట్లు ప్రధాని మోదీకి రాసిన లేఖలో ఎంపీ పొంగులేటి పేర్కొన్నారు. అత్యధికంగా 93,827 ఎకరాల్లో వరి, 70,371 ఎకరాల్లో మామిడిపంటలు వడగండ్ల వానలకు దెబ్బతిన్నాయన్నారు. తెలంగాణలో జిల్లాల వారీగా రైతులకు వాటిల్లిన నష్టాల గురించి, రైతాంగం పట్ల ప్రభుత్వం, అధికారులు వ్యవహరిస్తున్న తీరును లేఖలో ఆయన వివరించారు. రైతాంగ సమస్యల పట్ల ప్రభుత్వానికి కనువిప్పు కలగాలనే ఉద్దేశంతోనే గతవారం వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో రైతుదీక్ష నిర్వహించామనీ, అరుునా పాలకుల్లో మార్పు రాకపోవడం శోచనీయమని పొంగులేటి ఆవేదన వ్యక్తం చేశారు.
Back to Top