షర్మిల ఆరోగ్యం కుదుట పడాలని పూజలు

రాజమండ్రి (తూర్పో గోదావరి జిల్లా):

దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి షర్మిల త్వరగా కోలుకోవాలని వందలాది మంది విద్యార్థులు ప్రత్యేక పూజలు చేశారు. 750 మెట్లు ఎక్కి కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కొండపైకి చేరుకున్నారు. కొందరు విద్యార్థులు కొంతదూరం వరకూ మోకాళ్లపైనే మెట్లు ఎక్కారు. గుడిని చేరుకున్నాక నరసింహస్వామికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

అంతకు ముందు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డికి బెయిల్ రావాలని, మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో గాయపడిన శ్రీమతి షర్మిల ఆరోగ్యం కుదుట పడాలని కోరుతూ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. రాజమండ్రి నుంచి కోరుకొండ వరకూ కొనసాగిన పాదయాత్రలో నగరంలోని 19 విద్యాలయాలకు చెందిన సుమారు 500 మంది విద్యార్థులు పాల్గొన్నారు. పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె ప్రజలనుద్దేశించి మాట్లాడారు. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నేతలు ఎన్ని కుట్రలు చేసినా శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డిని జనం నుంచి వేరు చేయలేరని అన్నారు.

Back to Top