ప్రజావ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సాగనంపండి

మర్రిగూడ (నల్గొండ జిల్లా) : ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కిరణ్‌ కుమార్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సాగనంపాలని వై‌యస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల పిలుపునిచ్చారు. శ్రీమతి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర రెండవ రోజు శనివారం మర్రిగూడ మండలంలోని తిరుగండ్లపల్లి, ఎరుగండ్లపల్లి, కొండూరు, మర్రిగూడల్లో కొనసాగింది. రోడ్డుపై వెళ్లే ప్రయాణికులను శ్రీమతి షర్మిల ఆప్యాయంగా పలకరిస్తూ, కూలీల బాధలు అడిగి తెలుసుకుంటూ, విద్యార్థులతో ముచ్చటిస్తూ ముందుకు సాగారు.

పత్తి కూలీలకు షర్మిల ఆప్యాయ పలకరింపు:
శ్రీమతి షర్మిల పాదయాత్ర తిరుగండ్లపల్లి దాటిన తర్వాత రహదారి పక్కనే పొలంలో పత్తి ఏరుతున్న కూలీలు ఆమె దగ్గరికి పరుగెత్తుకు వచ్చారు. వారిని శ్రీమతి షర్మిల ఆప్యాయంగా పలకరించారు. వారి కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎరుగండ్లపల్లిలో గిరిజనులు డప్పుమేళాలు, సాంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికారు. శ్రీమతి షర్మిల వారితో ముచ్చటించారు. దారిలో ఓ గీత కార్మికుడిని కలిసి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటించారు. బాగా చదివి తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని సూచించారు. కొండూరు గ్రామస్థులు శ్రీమతి షర్మిలకు గుమ్మడికాయతో స్వాగతం పలికారు. షర్మిల చిన్నారులను ప్రేమతో ముద్దాడారు. మర్రిగూడలో డోలు వాయిద్యాలతో గ్రామస్థులు శ్రీమతి షర్మిలకు ఘన స్వాగతం పలికారు.

అభిమానం ఉప్పొంగిన వేళ:
వైయస్‌ఆర్‌సిపి అధ్యక్షుడు శ్రీ జగన్మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన పాదయాత్రకు దారి పొడవునా జనాభిమానం ఉప్పొంగింది. చింతపల్లి మండలం మాల్ నుంచి‌ ఉదయం ఆమె పాదయాత్ర ప్రారంభమైంది. పాదయాత్ర ప్రారంభానికి ముందు విద్యార్థులు, అక్కడి మహిళలు పెద్దఎత్తున తరలివచ్చారు. వారందరినీ ఆప్యాయంగా పలకరించిన అనంతరం శ్రీమతి షర్మిల పాదయాత్రను కొనసాగించారు.

నల్గొండ జిల్లాకు చెందిన పలువురు నాయకులు కూడా శ్రీమతి షర్మిలతో కలిసి శనివారం నడిచారు. పాదయాత్రలో వైయస్‌ఆర్‌సిపి జిల్లా కన్వీనర్ బీరవోలు సోమిరెడ్డి, నాయకులు గాదె నిరంజ‌న్‌రెడ్డి, అలక శ్రవణ్‌కుమార్‌రెడ్డి, ఇరుగు సునీల్‌కుమార్, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు ఎరెడ్ల శ్రీనివా‌స్‌రెడ్డి, మేకల ప్రదీప్‌రెడ్డి, కుంభం శ్రీనివాస్‌రెడ్డి, గూడూరు సరళారెడ్డి, సిరాజ్‌ఖాన్, నకిరెకంటి స్వామి, అలుగుబెల్లి రవీంద‌ర్‌రెడ్డి, మల్లు రవీందర్‌రెడ్డి, వాసుదేవుల జితేందర్‌రెడ్డి, తుమ్మలపల్లి భాస్కర్, చామల భాస్క‌ర్‌రెడ్డి, జడల ఆదిమల్లయ్య, నియోజకవర్గ నాయకులు బొమ్మిరెడ్డి రాఘవరెడ్డి, బోయపల్లి అనంతకుమార్, రామిడి వెంకట‌ రమణారెడ్డి, పంతంగి లక్ష్మణ్‌రావు తదితరులు పాల్గొన్నారు.
Back to Top