ప్రభుత్వ మొద్దు నిద్రను వదిలిద్దాం: విజయమ్మ

 పులివెందుల, 29 ఆగస్టు 2012 : జగన్‌బాబును స్ఫూర్తిగా తీసుకొని దీక్షలు నిర్వహించాలని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల ఎమ్మెల్యే వైయస్‌ విజయమ్మ పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. జగన్‌బాబు దీక్షలను ఎంతో సీరియస్‌గా తీసుకునేవారని, రెండు మూడు రోజుల పాటు నిష్ఠగా చేపట్టేవారని అన్నారు. 'మొద్దు నిద్రలో ఉన్న ఈ ప్రభుత్వాన్ని మేల్కొలపాలి. విద్యుత్ సమస్యపై వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగే బం‌ద్‌ను అన్ని వర్గాల ప్రజలు, పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలి' అని విజయమ్మ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పెరిగిపోయిన విద్యుత్‌ కోతలకు నిరసనగా బుధవారం వైయస్‌ఆర్ కడపజిల్లా పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లె విద్యుత్‌‌ సబ్‌స్టేషన్‌ వద్ద విజయమ్మ ఆధ్వర్యంలో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ధర్నా నిర్వహించించింది. నియోజకవర్గంలోని సింహాద్రిపురం, పులివెందుల మండలాల్లోని సబ్‌స్టేషన్ల వద్ద కూడా వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం ఆందోళనలు జరిగాయి.

ఈ ధర్నాలో విజయమ్మ మాట్లాడుతూ, 'రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే బాధ కలుగుతోంది. సర్కారు నిర్లక్ష్యంతో ఎన్నడూ లేనంత తీవ్రస్థాయికి చేరుకున్న విద్యుత్ సమస్యపై ‌వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన ఉద్యమానికి అన్ని వర్గాల ప్రజలు కలిసిరావాలి. గురువారం జరిగే ధర్నాలు, శుక్రవారం నిర్వహించే బంద్‌ ద్వారా ప్రజా నిరసనను సర్కారుకు వినిపించాలి. ‌వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేవలం రాజకీయ పార్టీ కాదు. ప్రజా పార్టీ. ప్రజా సంక్షేమం కోసం యువనేత వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి ఎన్నో ఉద్యమాలు చేశారు. వైయస్‌లో ఉన్న మనస్సు జగన్‌బాబులోనూ ఉంది. ప్రతి ఒక్కరూ జగన్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలి. అకుంఠిత దీక్షతో ఉద్యమించాలి. మన ప్రభుత్వం వచ్చేవరకు పోరాటం చేయాలి' అని పిలుపునిచ్చారు.

కరెంటు సమస్య ఉత్పన్నమవుతుందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ముందే తెలిసినా అవి నిర్లక్ష్యంగా వ్యవహరించడంవల్లే రాష్ట్రంలో చీకటి పరిస్థితులు నెలకొన్నాయని విజయమ్మ ధ్వజమెత్తారు. 'వైయస్‌ఆర్‌ పాలనలో రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండేవారు. ఆ మహానేత మరణం తర్వాత ఏ ఒక్క సామాజికవర్గం కూడా సంతోషంగా లేదు. ప్రస్తుత ప్రభుత్వాల వల్ల రైతులకు భరోసా లేకుండాపోయింది. సబ్సిడీ విత్తనాలు దొరకడంలేదు. ఎరువుల ధరలు 300 శాతం పెంచారు. పంటలకు గిట్టుబాటు ధరలు లభించడంలేదు. దీంతో రైతులు క్రాప్‌ హాలిడే ప్రకటిస్తున్నారు. మరోపక్క ప్రభుత్వం గ్రామాల్లో ఇష్టారాజ్యంగా విద్యుత్‌ కోతలు పెడుతోంది. వ్యవసాయానికి రెండు, మూడు గంటలు కూడా విద్యుత్‌ ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో ఉంది. పరిశ్రమలకు వారంలో మూడు రోజులు కోత విధిస్తున్నారు.దీనివల్ల రాష్ట్రంలో 10 వేల వరకు పరిశ్రమలు మూతపడి 20 లక్షల మంది కార్మికులు రోడ్డున పడటం బాధాకరం. ఎన్నో కష్టాలు పడి వైయస్‌ఆర్‌ అందించిన ప్రభుత్వాన్ని కూడా సరిగా నడుపుకోలేకపోతున్నారు. ఆయన మరణం తర్వాత ప్రస్తుత సర్కారు రెండుమార్లు విద్యుత్‌ చార్జీలు పెంచింది. సర్‌చార్జిలను వడ్డించేందుకు సిద్ధపడగా కోర్టు అక్షింతలు వేయడంతో ఆగారు. విద్యుత్‌ కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన బాధ్యతను నాయకులు విస్మరించారు. నాయకుడికి ముందుచూపు ఉండాలి. వైయస్‌ఆర్‌ ఎన్నోసార్లు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి కరెంటు సమస్యను అధిగమించారు. తెల్లవారుజామున ఐదు గంటలకే నిద్ర లేచి కరెంటు, ప్రాజెక్టుల్లో నీరు, నిత్యావసర సరకుల ధరలు, ఇతర సమస్యలపై సమీక్షించే వారు. 2008లో రాష్ట్రానికి బొగ్గు అవసరమైతే ఇతర రాష్ట్రాల నుంచి రూ.6 వేల కోట్లకు కొనుగోలు చేసి ప్రజలకు కరెంటు కష్టాలు తెలియకుండా పాలన సాగించారు. ప్రజలకు సంబంధించి పైసా కూడా పన్ను పెంచకుండా ఐదేళ్లు పరిపాలించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే.. అది ఒక్క వైయస్‌ రాజశేఖరరెడ్డి ప్రభుత్వమేనని సగర్వంగా చెబుతున్నాను' అని అన్నారు.

చంద్రబాబు ప్రగల్భాలు :
ఉచిత విద్యుత్ అంటే దుస్తులు ఆరేసుకోవడానికేనని వ్యాఖ్యానించిన టీడీపీ అ‌ధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఈనాడు ఏడు గంటలు కాదు.. 12 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తానని ప్రగల్భాలు పలుకుతున్నారని ‌విజయమ్మ విమర్శించారు. అధికారంలోకి వస్తే ఫీజు రీయింబర్సుమెంట్‌ పథకాన్ని కూడా అమలు చేస్తానంటూ చంద్రబాబు మాట్లాడుతున్న తీరు చూస్తే ‘ఉట్టికి ఎక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కుతాను’ అన్న చందంగా ఉందని విమర్శించారు. చంద్రబాబు చాలాసార్లు కరెంటు చార్జీలు పెంచారని, అందుకు నిరసనగా వైయస్‌ఆర్ బషీ‌ర్‌బాగ్ వద్ద 11 రోజులు నిరాహార దీక్ష చేసినా స్పందించలేదని అన్నారు. పైగా, నిరసన తెలిపిన వారిపై నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరిపించి అప్పటి చంద్రబాబు ప్రభుత్వం పలువురిని పొట్టన పెట్టుకుందని విమర్శించారు.

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చేవరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు పోరాడాలని విజయమ్మ పిలుపునిచ్చారు. వైయస్‌ రాజశేఖరరెడ్డి చేసిన పనులు, జగన్‌ చేయదలచిన కార్యక్రమాల గురించి ప్రజలకు స్పష్టంగా వివరించాలని విజయమ్మ అన్నారు.

 

Back to Top