<br/>విజయనగరం : పార్టీమారిన ఎమ్మెల్యేలది రాజకీయంగా ఆత్మహత్య అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ, విజయనగరం పార్టీ జిల్లా అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి వ్యాఖ్యానించారు. ప్రజలతరపునపోరాడుతున్న పార్టీ వైఎస్సార్సీపీ మాత్రమే అని పేర్కొన్నారు. విజయ నగరంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అసెంబ్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతు నొక్కే యత్నం చేశారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా కుంటుపడిందని ఆయన ఆరోపించారు. సీఎంగా ప్రమాణ స్వీకారోత్సవం సమయంలో చేసిన తొలి ఐదు సంతకాలు ఏమయ్యాయని చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. టీడీపీ హయాంలో బెల్టుషాపులు బాగా పెరిగాయని విమర్శించారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి ఏమైందని నిలదీశారు. విశాఖ ప్రత్యేక రైల్వే జోన్ కోసం పార్టీ నాయకుడు గుడివాడ అమర్నాథ్ దీక్షకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని కోలగట్ల వీరభద్రస్వామి స్పష్టం చేశారు.