`పచ్చ`పాతం-వైయస్ఆర్సీపీ నేతలే టార్గెట్గా సోదాలు-శిల్పా వర్గీయుడి మెడికల్ షాపులో రూ.3.57 లక్షలు సీజ్-భూమా వర్గీయులు డబ్బులు పంచుతున్నా పట్టించుకోని అధికారులు<br/>నంద్యాల: ఉప ఎన్నిక వేళ అధికార పార్టీ నేతల అరాచకాలు పెరిగిపోతున్నాయి. ఎంతగా పెరిగిపోతున్నాయంటే అధికారాన్ని అడ్డుపెట్టుకొని పోలీసులతో దాడులు చేయించడం, అర్ధరాత్రులు సోదాల పేరుతో వేధించడం వంటి చర్యలకు పాల్పడుతోంది. అదే పోలీసులు అధికార పార్టీ నేతలు ఏం చేసినా కన్నెత్తి చూడటం లేదు. సాక్షాత్తు ముఖ్యమంత్రి నా పెన్షన్ తింటున్నారు.. నేనిచ్చే రేషన్ తీసుకుంటున్నారు..మేం వేసిన రోడ్లపై తిరుగుతున్నారు.. మేం వేసిన వీధి దీపాల కింద నడుస్తున్నారు..నాకు ఓటు వేయకపోతే ఎలా? లేదంటే పెన్షన్లు, రేషన్ తీసుకోవద్దు..నాకు వ్యతిరేకంగా ఉన్న గ్రామాలను పక్కన పెట్టాల్సి వస్తుంది. వంటి వ్యాఖ్యలు చేసినా పట్టించుకునే నాథుడు లేడు. టీడీపీని గెలిపిస్తే రౌడీషీట్ ఎత్తివేస్తాం.. మని కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుడు సోమిశెట్టి అన్నా ఎలాంటి చర్యలు లేవు. ఒక అబ్బ, అమ్మకు పుట్టిన వారైతే టీడీపీకి ఓటు వేయాలని నంద్యాలకు చెందిన టీడీపీ నేత అనుచిత వ్యాఖ్యలతో బెదిరించినా నోరు మెదపడం లేదు. రేయ్..ఉండ్రా నేను చెప్పేది విను.. అంటూ మంత్రి లోకేష్ నిరుద్యోగులపై మండిపడ్డా అధికారులు చోద్యం చూశారు. ఇక నంద్యాలలో ఓటమి ఖాయమని భావించిన టీడీపీ నేతలు పోలీసులను అడ్డుపెట్టుకొని ప్రతిపక్ష పార్టీ నేతలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. <br/>అర్ధరాత్రులు సోదాలుప్రతిపక్ష పార్టీకి చెందిన కౌన్సిలర్లు అమృతరాజ్, సుబ్బరాయుడు, మరో కౌన్సిలర్ ఇళ్లపై పోలీసులు గతంలో అర్ధరాత్రి సోదాలు నిర్వహించి భయపెట్టారు. వారి సోదాల్లో ఏం దొరక్క పోయినా వేధించడమే పనిగా పెట్టుకున్నారు. తాజాగా నంద్యాలలో శిల్పా మోహన్రెడ్డి వర్గీయుడైన ఆంధ్రా మెడికల్ షాపుపై పోలీసులు సోదాలు నిర్వహించారు. షాపులో ఉన్న రూ.3.57 లక్షలకు సంబంధించి ఆధారాలు, బిల్లులు చూపించినా అధికారులు వినిపించుకోకుండా ఆ డబ్బును సీజ్ చేశారు. అదే నంద్యాలలో భూమా వర్గీయులు తమ ప్రచారానికి వచ్చిన ప్రజలకు డబ్బులిచ్చేందుకు గ్రీన్ టోకన్లు పంచుతున్నా ఏ అధికారి అడ్డు చెప్పలేదు. <br/>విచ్చలవిడిగా డబ్బుల పంపిణీనంద్యాల ఉప ఎన్నికలో గెలిచేందుకు టీడీపీ నేతలు విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేస్తున్నారు. డబ్బులిచ్చి స్థానికేతరులను తీసుకొచ్చి నంద్యాలలో ప్రచారానికి వినియోగించుకుంటున్నారు. నిన్న నంద్యాలలోని 42వ వార్డులో డబ్బులిచ్చి తీసుకువచ్చిన వారికి టీడీపీ నేతలు ఆకుపచ్చరంగులో ఉన్న టోకెన్లను పంచుతూ కనిపించారు. ఈ విషయం బయటకు వచ్చినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మూడు రోజులుగా నంద్యాలలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఉప ఎన్నికల్లో నిర్వహిస్తున్న రోడ్ షోలకు విశేష స్పందన రావడాన్ని టీడీపీ నేతలు జీర్ణించుకోలేక పోతున్నారు. దీంతో అక్రమాలకు, ప్రలోభాలకు టీడీపీ నేతలు తెర లేపారు. అంతేకాకుండా ప్రతిపక్ష పార్టీ నేతల ఇళ్లపై దాడులు నిర్వహిస్తూ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోంది. అధికార పార్టీ నేతల తీరును నంద్యాల ఓటర్లు బాగా గమనిస్తున్నారు. ఓటుతోనే బుద్ధి చెప్పేందుకు సిద్ధమవుతున్నారు.