ఆన్‌లైన్‌ ఉద్యమానికి శ్రీకారం

  • సేవ్‌ డెమోక్రసీ పేరుతో ఫేస్‌బుక్‌ పేజీ
  • పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా భాగస్వాములు కావాలని వినతి
  • వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి
తిరుపతి: ప్రజాస్వామ్యానికి చంద్రబాబు తిలోదకాలు ఇస్తూ.. తుంగలో తొక్కుతున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మండిపడ్డారు. రాజ్యాంగ విలువలను పాటించకుండా ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కేటాయించి అవమానపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో చెవిరెడ్డి మీడియాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ‘సేవ్‌ డెమోక్రసీ’ పేరుతో ఆన్‌లైన్‌ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. సేవ్‌ డెమోక్రసీ ఫేస్‌బుక్‌ పేజీని మీడియా సమక్షంలో విడుదల చేశారు. పార్టీలకు అతీతంగా దేశ, విదేశీయులు భాగస్వాములు కావాలని కోరారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి అందరూ చేతులు కలిపి మీ అభిప్రాయాలను పేజీ ద్వారా వ్యక్త పరచాలని సూచించారు. రాష్ట్రంలో అనైతిక, అధర్మ, అరాచక పాలనకు స్వస్తి పలకాలని కోరారు. 

దమ్ముంటే ఆ నలుగురిని ఎన్నికలకు పంపించు
చంద్రబాబు అనైతిక చర్యలకు గవర్నర్‌ కూడా ప్రోత్సాహం అందిస్తున్నాడని చెవిరెడ్డి విమర్శించారు. రాజ్యాంగాన్ని రక్షించాల్సిన గవర్నర్‌ ఇలా వ్యవహరించడం బాధాకరమన్నారు. తెలంగాణలో నీతి నిజాయితీ అని మాట్లాడిన చంద్రబాబు ఇక్కడేం ఎలగబెట్టారని ప్రశ్నించారు. ఫిరాయింపు దారులకు మంత్రి పదవులు కేటాయించడం బదులు వారితో రాజీనామా చేయించి ప్రజాక్షేత్రంలోకి పంపించివుంటే బాగుడేందన్నారు. నా పరిపాలనకు అవార్డులు, రివార్డులు వస్తున్నాయని చెప్పుకుంటున్న చంద్రబాబుకు దమ్ముంటే ఆ నలుగురు ఫిరాయింపు మంత్రులతో రాజీనామా చేయించాలని డిమాండ్‌ చేశారు. అంతమంచి పాలన అయితే ఎందుకు భయపడుతున్నారని చంద్రబాబును ప్రశ్నించారు. 
Back to Top