<strong>నిర్మల్:</strong> ఆదిలాబాద్ మాజీ ఎంపీ ఎ. ఇంద్రకరణ్ రెడ్డి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరికను పురస్కరించుకుని నిర్మల్ పట్టణం సందడిగా మారింది. ఎన్టీఆర్ మినీస్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు అభిమానులు వెల్లువెలా తరలివచ్చారు. నియోజకవర్గంతోపాటు జిల్లా నలుమూలల నుంచి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో హాజరై తమ అభిమానాన్ని చాటారు. సభకు ఉదయం నుంచే నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పోటెత్తారు. వివిధ ప్రాంతా ల నుంచి వాహనాల్లో వచ్చారు. ఎటుచూసినా జనసంద్రాన్ని తలపించింది. <br/><strong>ర్యాలీలుగా...</strong> ఆయా గ్రామాలతోపాటు పట్టణంలోని వివిధ వార్డుల నుంచి పెద్దఎత్తున ర్యాలీలుగా సభాస్థలికి తరలివచ్చారు. బుధవార్పేట్ నుంచి దాదాపు రెండు వేల మంది అప్పాల గణేశ్ చక్రవర్తి ఆధ్వర్యంలో అలాగే ఈదిగాం తదితర వార్డుల నుంచి కూడా పెద్దఎత్తున ర్యాలీలుగా వచ్చారు. పార్టీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు నరేశ్ భారీ బ్యానర్, జెండాలతో నినాదాలు చేస్తూ వచ్చారు. బహిరంగ సభ స్థలి వద్ద కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. <br/><strong>ఘన స్వాగతం...</strong><strong><br/></strong> పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మకు ఘనస్వాగతం పలికారు. జిల్లా ముఖద్వారమైన నిర్మల్ మండలంలోని సోన్ గోదావరి బ్రిడ్జిపై మాజీ ఎంపీ అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, పార్టీ జిల్లా కన్వీనర్ బోడ జనార్దన్, మాజీ ఎమ్మెల్యే కోనప్ప, కార్మిక విభాగం రాష్ట్ర కన్వీనర్ జనక్ప్రసాద్, జిల్లా కో కన్వీనర్ రవిప్రసాద్తోపాటు పలువురు నాయకులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా మాధాపూర్ గ్రామానికి వెళ్లి అక్కడ వైయస్ఆర్ అభిమాని, నీటి సంఘం నాయకుడు జీవన్రెడ్డి ఆధ్వర్యంలో ప్రతిష్టించిన దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అక్కడి నుంచి పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియానికి చేరుకున్నారు. కార్యక్రమ అనంతరం మాజీ ఎంపీ అల్లోల ఇంద్రకరణ్రెడ్డి స్వగృహానికి చేరుకొని అక్కడ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం వారి కుటుంబీకులతో ముచ్చటించారు. శ్రీమతి విజయమ్మ ప్రసంగించే సమయంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు చేసిన నినాదాలతో ప్రాంగణం దద్దరిల్లింది. జగనన్న జిందాబాద్.. జై జగన్... అంటూ చేసిన నినాదాలు మిన్నంటాయి. ఐకేరెడ్డి నాయకత్వం వర్దిల్లాలి అంటూ నినాదాలు చేశారు. <br/><strong>పెద్ద ఎత్తున చేరిక...</strong><strong><br/></strong> మాజీ ఎంపీ అల్లోల ఇంద్రకరణ్రెడ్డితోపాటు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున వైఎస్ఆర్ సీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ సమక్షంలో పార్టీలో చేరారు. డీసీసీబీ మాజీ చైర్మన్ రాంకిషన్రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ అప్పాల అనురాధ మహేశ్, మాజీ వైస్ చైర్మన్ వాజిద్ అహ్మద్ఖాన్, సరస్వతీ కాలువ డిస్ట్రిబ్యూటరీ చైర్మన్ హరీష్కుమార్, బోథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ తుల శ్రీనివాస్, డీసీసీబీ డెరైక్టర్ రమేశ్, దిలావర్పూర్ మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు పద్మ, మాజీ సర్పంచ్ పద్మ, మాజీ కౌన్సిలర్లు తారక రఘు, నల్లూరి పోశెట్టి, మేడారం ప్రదీప్, మజీదొద్దీన్, సాజిద్అలీ, నయీంతోపాటు పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పార్టీలో చేరారు. వీరికి కండువాలు వేసి గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ పార్టీలోకి ఆహ్వానించారు. <br/><strong>విజయమ్మకు సన్మానం.. </strong><strong><br/></strong> శ్రీమతి విజయమ్మ మొదటిసారిగా జిల్లాకు రావడంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా సన్మానించారు. పార్టీ జిల్లా కన్వీనర్ బోడ జనార్దన్, కో కన్వీనర్ రవి ప్రసాద్, మాజీ ఎంపీ అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, నిర్మల్ పట్టణానికి చెందిన నాయకులు జ్ఞాపికలు అందజేశారు. ఆదిలాబాద్కు చెందిన నాయకులు నాగలి, మామడ మండల కేంద్రానికి చెందిన చిత్రకారుడు సలీం వైఎస్సార్, విజయమ్మలతో కూడిన చిత్రాన్ని బహూకరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.<br/><strong>కేక్ కట్ చేసి సంబరాలు...</strong> పార్టీ అధ్యక్షుడు, ఎంపీ శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల పుట్టిన రోజు సోమవారం కావడంతో వేడుకలను ఘనంగా నిర్వహించారు. సభా స్థలిపై పట్టణ నాయకులు కేక్ను విజయమ్మతో కట్ చేయించారు.