బాబు చర్య అనైతికం, అప్రజాస్వామికం

హైదరాబాద్:

ఇతర పార్టీలను దెబ్బతీయడంపై దృష్టి సారించే బదులు తాను ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడానికి ప్రయత్నించాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ హితవు పలికింది. వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా ఫ్యాన్‌ గుర్తుపై గెలిచిన ప్రజా ప్రతినిధులను టీడీపీలోకి ఆకర్షిస్తున్న టీడీపీ చర్యలు అనైతికం, అప్రజాస్వామికం అని ఖండించింది. ఎన్నికల హామీలు ఏ విధంగా అమలు చేయాలో తెలియక, ఆ హామీలపై నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని వైయస్ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కొత్తపల్లి గీత ధ్వజమెత్తారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో వారిద్దరూ ఆదివారంనాడు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల హామీల అమలును పక్కనబెట్టి ప్రతిపక్ష పార్టీ నాయకుల వలసలను చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారని వారు ఎండగట్టారు.

తెలంగాణలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి కె.చంద్రశేఖర్‌రావు అపాయింటెడ్ డే జూన్ 2నే ముహూర్తం పెట్టుకుంటే చంద్రబాబు మాత్రం వెన‌కెనక్కి వెళ్తున్నారని మేకపాటి ఎద్దేవా చేశారు. ‘చంద్రబాబు చేయాల్సిన పనులు, ఎన్నికల వాగ్దానాలు చాలా ఉన్నాయి. రైతుల వ్యవసాయ రుణాలు రద్దు చేస్తామన్నారు. చేనేత రుణాలు మాఫీ అన్నారు. వృద్ధులు, వితంతువులకు వెయ్యి రూపాయలు.. వికలాంగులకు రూ. 1,500 పింఛన్ ఇస్తామన్నారు. వీటన్నింటి అమలు గురించి ప్రజలు ఎదురు చూస్తున్న సమయంలో చంద్రబాబు వాటిపై దృష్టి పెట్టకుండా... వై‌యస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలనో, ఎంపీలనో టీడీపీలోకి ఎలా లాక్కుందామనే అనైతిక చర్యలు మొదలుపెట్టారు’ అని మేకపాటి విమర్శించారు.

‘‌ఎన్నికల వాగ్దానాలు ఎలా నేరవేర్చాలో ముందుగా చంద్రబాబు నాయుడుగారూ ఆలోచించండి. వ్యవసాయ పనుల సీజను మొదలవుతోంది. రుణాల మాఫీ జరిగి కొత్త రుణాలు వస్తాయని రైతులు ఎదురుచూస్తున్నారు. పెన్షన్ కోసం వృద్ధులు, వితంతువులు, వికలాంగులు ఆశగా చూస్తున్నారు’ అని‌ మేకపాటి హితవు పలికారు. బలమైన ప్రతిపక్షంగా ఉన్న వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీని దెబ్బతీయాలన్న పన్నాగంతో చంద్రబాబు పనిచేస్తున్నారని‌ ఆయన విమర్శించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షమే లేకుండా చేద్దామని ఆయన అనుకుంటే అది జరిగే పనికాదని మేకపాటి హెచ్చరించారు.

వారిపై వేటు తప్పదు :
వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీలో గెలిచి మరో పార్టీలో చేరితే ఫిరాయింపుల చట్టం వర్తిస్తుందని మేకపాటి స్పష్టం చేశారు. ఈ విషయం కేంద్ర ఎన్నికల సంఘం కూడా చెప్పిందన్నారు. వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ‌ తరఫున గెలిచి ఆ తడి ఇంకా ఆరక ముందే పార్టీ ఫిరాయించడం అంటే ప్రజాస్వామ్యాన్ని ఎంత అపహాస్యం చేస్తున్నారో కళ్లకు కడుతుందన్నారు. గతంలో తాను కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలిచినా ఆ పార్టీకి రాజీనామా చేసిన తరువాతే వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీలోకి వ‌చ్చిన విషయాన్ని రాజమోహన్‌రెడ్డి గుర్తు చేశారు.

జగనన్న వెంటే నేనుంటా- గీత :
శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి వెంటే తాను వైయస్ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీలో ఉంటానని అరకు ఎంపీ కొత్తపల్లి గీత స్పష్టం చేశారు. ఎన్నికల్లో పార్టీ గెలుపోటములు సహజమే అన్నారు. తాను పార్టీ మారతాననే ప్రచారం కేవలం ఉహాగానాలే అని ఆమె కొట్టిపారేశారు. అలాంటి ఆలోచన కానీ, అవసరం కానీ తనకు లేదన్నారు. పార్టీ ఫిరాయింపులతో తాను రాజకీయ జీవితాన్ని ప్రారంభించాలనుకోవడం లేదన్నారు.

Back to Top