మంత్రిని బర్తరఫ్ చేయాలి

  • అక్రమ ఎన్నికను రద్దు చేయాలి
  • బాబు బీసీ వ్యతిరేకి
  • పరిటాల సునీత కమ్మ కులపక్షపాతి
  • రాప్తాడులో ప్రజాస్వామ్యమే లేదు
  • అక్రమ ఎన్నికపై కోర్టును ఆశ్రయిస్తాం
  • వైయస్సార్సీపీ రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి
అనంతపురంః కనగానపల్లి ఎంపీపీ ఉపఎన్నికలో వైయస్సార్సీపీ ఎంపీటీసీలపై దౌర్జన్యం చేసిన పరిటాల సునీతను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడంతో పాటు అక్రమ ఎన్నికను రద్దు చేయాలని వైయస్సార్సీపీ రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిన్నటి షోకాల్డ్ ఉపఎన్నిక  ఏవిధంగా జరిగిందో  రాష్ట్రమంతా చూసిందన్నారు. చంద్రబాబు ఆదేశాలతోనే అధికారులు, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. నాయక్ సినిమాను తలపించేలా పరిటాల సునీత కనుసన్నల్లో ఎంపీపీ ఉపఎన్నిక తతంగమంతా 15 నిమిషాల్లోనే ముగిసిందని విమర్శించారు. వైయస్సార్సీపీ నేతలను, మీడియాను రానీయకుండా అడ్డుకొని అక్రమ పద్ధతిలో ఎన్నికను జరుపుకున్నారని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. 

ఎక్స్ అఫిషియో మెంబర్ గా వెళ్లాల్సిన పరిటాల సునీత ఎంపీటీసీలను బెదిరించడం, ప్రలోభపెట్టడం దుర్మార్గమన్నారు. టీడీపీ నుచి వైయస్సార్సీపీలోకి వచ్చిన ఎంపీటీసీలను చేతులెత్తాలని బెదిరించారని, వినకపోవడంతో  కిందపడేసి కొట్టడం చేశారని మండిపడ్డారు. ఈ తంతంగం అయ్యాక ఎన్నికలు జరగకుండానే  ప్రమాణస్వీకారం చేయడం. స్పెషల్ ఆఫీసర్స్ దాన్ని డిక్లేర్ చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. సభ్యసమాజం తలదించుకునేలా ప్రజాస్వామ్యం ఖూనీ చేసేవిధంగా ఉపఎన్నిక జరిగిందని విమర్శించారు. పరిటాల సునీత ఇలాంటి కుట్రలకు పాల్పడుతారనే ముందస్తుగా డీజీపీ, ఎలక్షన్ కమిషన్, జిల్లా కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేశామన్నారు. అయినా కూడా  తగు చర్యలు తీసుకోలేదన్నారు. అంతా ముఖ్యమంత్రి స్క్రిప్ట్ ప్రకారమే జరిగిందన్నారు. ఉద్దేశ్యపూర్వకంగా చంద్రబాబు, పరిటాల సునీత బీసీలను అణచివేస్తున్నారని మండిపడ్డారు. 

కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఎంపీటీసీలు ఎవరూ టీడీపీలో గెలవకపోవడంతో వైయస్సార్సీపీ తరపున గెలిచిన కమ్మ కులానికి చెందిన గీత ను టీడీపీలోకి అనధికారికంగా తీసుకున్నారని, ఆమెను ఎంపీపీగా చేయడానికి బీసీకి చెందిన రాజేంద్రను తొలగించి పరిటాల సునీత కులపక్షపాతాన్ని చాటుకున్నారని ప్రకాష్ రెడ్డి విమర్శించారు. దొరల పాలనే సాగాలి, కమ్మకోటలో ఎవరూ ఏమీ చేయలేరని మంత్రి పరిటాల సునీత మాట్లాడడం అహంకార పూరితమన్నారు. వీళ్లకు అధికారం, పోలీసుల మద్దతు తప్ప ప్రజాబలం లేదని అన్నారు. నిజంగా ప్రజాబలం ఉంటే మంత్రి లోపల కూర్చోవాల్సిన పనిలేదని చెప్పారు. పరిటాల సునీత మండల పరిషత్ కార్యాలయంలో ఓటర్లతో మాట్లిడిదంతా రికార్డింగ్ లో ఉందని, ఆ కాపీని తమకివ్వాలని అధికారులను కోరారు. ఎన్నికల ప్రొసీడింగ్స్, మినిట్స్, వీడియో రికార్డింగ్స్ అన్నీ ఇవ్వాలన్నారు. 

నిన్నటి ఎలక్షన్ ట్రైలర్ మాత్రమేనని గత 20 ఏళ్లుగా పరిటాల ఉన్న ఏరియాలో ప్రజాస్వామ్యమే లేదని తోపుదుర్తి అన్నారు. పరిటాల పెనుగొండ నుంచి ఎన్నికైనప్పటి నుంచి 25 గ్రామాల్లో ఇదే తంతు జరుగుతోందన్నారు. పరిటాల అనుచరులు, సాయుధులు పోలింగ్ బూతుల చుట్టూ మొహరించడం. ప్రలోభాలు, బెదిరింపులు, రిగ్గింగ్ లు చేయడం కొన్నేళ్లుగా సాగుతోందని ప్రకాష్ రెడ్డి నిప్పులు చెరిగారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తో కుమ్మక్కై రెవెన్యూ అధికారులను లోబర్చుకొని  దొంగఓట్లతో పరిటాల సునీత అధికారంలోకి వచ్చిందని అన్నారు.  220 గ్రామాల్లో 200 గ్రామాల ప్రజలు పరిటాల సునీతను వ్యతిరేకిస్తున్నారని స్పష్టం చేశారు. కనగానపల్లె ఎంపీపీ ఎన్నికల అక్రమాలపై హెచ్ఆర్సీ, కోర్టులను ఆశ్రయిస్తామని తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి తెలిపారు. బీసీలకు న్యాయం చేసేవరకు వైయస్సార్సీపీ విశ్రమించదన్నారు. బీసీ వ్యతిరేకి అయిన చంద్రబాబు బీసీలను అణచివేసేందుకు ఇతర పార్టీలో గెలిచిన కమ్మ కులస్తులను ప్రలభోపెడుతున్నారని, ఇంతకంటే ఘోరం మరొకటి లేదని ధ్వజమెత్తారు. 




Back to Top