అసమగ్ర బిల్లుకు వైయస్ఆర్‌సీపీ వ్యతిరేకం

హైదరాబాద్ :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు - 2013ను తిప్పిపంపాలని వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ‌నాయకుడు, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు డిమాండ్ చేశారు.‌ ఈ బిల్లు రాజ్యాంగానికి, సంప్రదాయ స్ఫూర్తికి పూర్తి భిన్నంగా, అడ్డగోలుగా, అప్రజాస్వామికంగా, అసమగ్రంగా ఉన్నదని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్ర విభజనకు వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ వ్యతిరేక‌ం అని స్పష్టంచేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్నదే వైయస్ఆర్‌సీపీ డిమాండ్‌ అని శాసనమండలిలో ఆయన శనివారంనాడు స్పష్టంగా పేర్కొన్నారు.

‘సార్వత్రిక ఎన్నికలు తరుముకొస్తున్న ఈ తరుణంలో అత్యంత సున్నితమైన రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లును ఆగమేఘాల మీద కేంద్రం పంపించడం అప్రజాస్వామికం. అందుకే ఈ బిల్లును వైయస్ఆర్‌సీపీ వ్యతిరేకిస్తోంది. ఐదు దశాబ్దాలుగా మూడు ప్రాంతాల వారు పెట్టుబడులు పెట్టి అభివృద్ధి చేసిన హైదరాబాద్‌ నగరాన్ని తెలంగాణకు మాత్రమే వదిలేస్తే రేపు సీమాంధ్ర ప్రజలు ఉన్నత విద్య, ఉద్యోగాలు, మెరుగైన వైద్యం కోసం ఎక్కడికి వెళ్లాలి? ఈ సమస్యలకు బిల్లులో పరిష్కారాలు చూపలేదు. విభజిస్తే సీమాంధ్ర ప్రాంతం అధోగతి పాలవుతుంది. అసమగ్రంగా ఉన్న బిల్లుపై చర్చ జరిపించే ప్రయత్నం చేయడం సభా హక్కుల ఉల్లంఘనే’ అని అప్పారావు  వ్యాఖ్యానించారు.

Back to Top