పచ్చటి బతుకులను నాశనం చేస్తారా?

హైదరాబాద్, నవంబర్ 18: పంటలు అంతగా పండని నాసిరకం భూములు అందుబాటులో ఉన్నా ఏడాది పొడవునా పచ్చని పంటలతో కళకళలాడే పొలాలనే రాజధాని నిర్మాణం కోసం ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కె.పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు. పచ్చని పొలాల్ని రైతులనుంచి లాక్కుంటే వాటిపై ఆధారపడిన వేలాదిమంది కూలీలు, కౌలు రైతులు, మత్సకారులు, కల్లు గీత కార్మికుల జీవనోపాధి ఏం కావాలని ప్రశ్నించారు.

ఆయన మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాజధాని నిర్మించ తలపెట్టిన గ్రామాల రైతులు తమ భూములు పోతాయేమోనని తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారని, తమకు అన్నం కూడా సహించడం లేదని, రాత్రిపూట నిద్ర కూడా కరవైందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఇవి తాము చెబుతున్న మాటలు కానే కాదని, తమ పార్టీ నేతల బృందం ఆ గ్రామాల్లో పర్యటించినప్పుడు రైతులు, కౌలు రైతులు, కూలీలు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలని వివరించారు.

ప్రభుత్వం అబద్ధపు ప్రచారం చేస్తోంది...

రాజధాని నిర్మాణం కోసం రైతులు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని, వారంతా ఆనందంగా ఉన్నారని ప్రభుత్వం టీవీలు, పత్రికల ద్వారా చేసుకుంటున్న ప్రచారం అంతా పూర్తిగా అబద్ధమని పార్థసారథి చెప్పారు. గ్రామాల్లో 80 నుంచి 85 శాతం మంది రైతులు తమ పొలాలు ఇవ్వడానికి వ్యతిరేకంగా ఉన్నారన్నారు. ప్రభుత్వం ప్రత్యేకంగా బస్సుల్ని పంపి తమకు అనుకూలంగా ఉండే రైతులను గ్రామానికి ఓ ఐదుగురిని తీసుకువచ్చి వారిచేత అధికారులు, మంత్రులు భూములివ్వడం సమ్మతమేనని చెప్పించుకుంటున్నారు.

భూములు లాక్కోవడానికి చట్టం తెస్తారా?

2014 నుంచి అమలులోకి వచ్చిన భూ సేకరణ చట్టం ప్రకారం 80శాతం మంది రైతులు సమ్మతిస్తేగానీ ప్రభుత్వం భూ సేకరణ చేయటానికి వీల్లేదని, దానిని ఇక్కడ అమలుచేయాలని పార్థసారథి డిమాండ్ చేశారు. భూ సేకరణకు ప్రస్తుతమున్న చట్టాన్నే అమలు చేస్తారా లేక తమ భూములను లాక్కోడానికి సీఎం మళ్లీ కొత్త చట్టం ఏదైనా తెస్తారా! అని రైతులు హడలిపోతున్నారు. 'రైతులు అత్యాశకు పోతున్నారు.. అవసరమైతే భూసేకరణ చట్టాన్ని ప్రయోగించైనా భూములను తీసుకోవాల్సి వస్తుంది' అని సాక్షాత్తూ ముఖ్యమంత్రే బెదిరించడం రైతులను భయాందోళనలకు గురి చేస్తుందన్నారు.

రైతులకు నచ్చజెప్పి వారిని సంతృప్తిపర్చేలా ప్యాకేజీలిచ్చి భూసేకరణ చేయాలే తప్ప వారి హక్కుల్ని, ప్రయోజనాల్ని కాలరాసేలా ప్రభుత్వం వ్యవహరిస్తే వైఎస్సార్సీపీ వారికి అండగా నిలబడి పోరాడుతుందని పార్థసారథి హెచ్చరించారు. ల్యాండ్ పూలింగ్ విధానంలో ఒక ఎకరం తీసుకుంటే వెయ్యి గజాల భూమిని ఇస్తామని ప్రభుత్వం చెప్పడం రైతులను సంతృప్తి పరచడం లేదన్నారు. సాధారణంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు రైతుల భూములు కొన్నా వారికి సగం సగం లేదా 60:40 నిష్పత్తిలో స్థలాలను ఇస్తూ ఉంటారని, అలాంటిది ప్రభుత్వ ప్యాకేజీ చూస్తే రైతులకు 25 శాతం కూడా వచ్చే పరిస్థితి లేదని, అందుకే వారు ఆందోళన చెందుతున్నారన్నారు.

Back to Top