'జగన్‌తోనే రాజన్న సువర్ణ రాజ్యం సాధ్యం'

వనపర్తి (మహబూబ్‌నగర్ జిల్లా) : దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి అందించిన సువర్ణ రాజ్యం వైయస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ జగన్మోహన్‌రెడ్డి వల్లే సాధ్యం అవుతుందని పార్టీ సీఈసీ సభ్యుడు రావుల రవీంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. తోడేళ్ళు లాంటి కాంగ్రెస్‌, టిడిపిలు పులిలాంటి శ్రీ జగన్మోహన్‌రెడ్డిని జైలుపాలు చేశాయని ఆయన వ్యాఖ్యానించారు. ఇంతటితో తమ పని పూర్తయిపోయిందనుకుంటే పొరపాటే అన్నారు. అసలు కథ ఇప్పుడే ప్రారంభమైందని రావుల రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. లాటరీ సిఎంగా పేరుపొందిన కిరణ్‌కుమార్‌రెడ్డి 2014లో మళ్లీ అధికారంలోకి వస్తామని ప్రకటించుకోవడం హాస్యాస్పదం అని రావుల ఎద్దేవాచేశారు. కిరణ్‌ కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీ‌కి ఓట్లు వేసి గెలిపించే స్థితి లేదన్నారు.

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు కేజీ మూర్తి ఆధ్వర్యంలో వనపర్తిలోని ఎంబీ ఫంక్షన్‌ హాలులో బుధవారం జరిగిన కార్యక్రమంలో సుమారు 350 మంది మహిళలు, యువకులు, విద్యార్థులు పార్టీలో చేరారు. కేజీ మూర్తి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వైయస్‌ఆర్‌సిపి జిల్లా అధికార ప్రతినిధి ఆర్యభవన్‌ శ్రీనివాస్‌రెడ్డి, కొల్లాపూర్‌ నాయకుడు గౌరారం వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రావుల రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ.. అధికార, ప్రతిపక్షాలు బావిలో కప్పల్లా జనమంతా తమ వెంటే ఉన్నారని సంబరపడిపోతున్నాయని.. కానీ జనం శ్రీ జగన్మోహన్‌రెడ్డి వైపు ఉన్నారనే విషయం వారికి తెలియకపోవడం ఆశ్చర్యకరమని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియాకు ఎవరు  ఎదురు నిలిచినా ఆమె ఆల్సేషన్‌ కుక్కల్లాంటి సిబిఐని వదలడం సాధారణమన్నారు.

‌నిరుపేదల బతుకుల్లో వెలుగులు నిండాలంటే శ్రీ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ఆర్యభవన్‌ శ్రీనివాస్‌రెడ్డి ‌అన్నారు. శ్రీ జగన్‌తోనే వైయస్‌ స్వర్ణయుగం వస్తుందని గౌరారం వెంకట్‌రెడ్డి అన్నారు.
Back to Top