చెన్నై, 4 డిసెంబర్ 2013:
నెల్లూరులోని ప్రముఖ పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి బుధవారంనాడు వైయస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ప్రభాకర్రెడ్డికి శ్రీ జగన్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
సమైక్యాంధ్రకు మద్దతు కూడగట్టేందుకు జాతీయ, ప్రాంతీయ పార్టీల అగ్రనేతలను కలుసుకుంటున్న శ్రీ జగన్మోహన్రెడ్డి బుధవారం చెన్నై వచ్చారు. తమిళనాడు సీఎం జయలలితను కలిసి మద్దతు కోరారు. శ్రీ జగన్ రాకతో చెన్నై జనసంద్రంగా మారింది. నగరంలో అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. దారి పొడవునా వేలాది మంది అభిమానులను పలకరిస్తూ శ్రీ జగన్ ముందుకు కదిలారు. దాంతో ఏడు కిలోమీటర్ల ప్రయాణానికి ఆయనకు సుమారు రెండు గంటల సమయం పట్టింది.
పార్టీలో చేరిన పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకరరెడ్డితో పాటు, కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి, తమిళనాడు విభాగం నేతలు శరత్కుమార్, శరవణన్, జాకీర్ హుస్సేన్ తదితరులు చెన్నైలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తమిళ ప్రజలు వాటి ముందు నిలబడి మరీ వీక్షించారు. విమానాశ్రయం నుంచి గిండీ, ఆళ్లారుపేట, మైలాపూరు, రాధాకృష్ణన్శాలై, సచివాలయం మీదుగా శ్రీ జగన్మోహన్రరెడ్డి పయనించిన మార్గమంతా ఫ్లెక్సీలు, కటౌట్లు, వాల్పోస్టర్లు వెలిశాయి. కోడంబాక్కం పరిధిలో వందలాది వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతాకాలు రెపరెపలాడాయి.