ఎమ్మెల్యేలపై చర్యకు ప్రభుత్వం కుట్ర

()స్పీకర్,గవర్నర్ పై దాడి చేసిన చరిత్ర టీడీపీది
()ఎన్టీఆర్ కు కనీసం మాట్లాడే అవకాశం ఇవ్వలేదు
()వైయస్సార్సీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి

హైదరాబాద్ : తమ పార్టీ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం కుట్ర పన్నిందని వైయస్సార్సీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. అందులో భాగంగానే యనమల తీర్మానం ప్రవేశపెట్టారని, వర్షాకాల సమావేశాల్లో ప్రభుత్వం రెచ్చగొట్టేలా వ్యవహరించిందని పెద్ది రెడ్డి మండిపడ్డారు.  సభ్యులను సస్పెండ్ చేశాకే సభలోకి మార్షల్స్ రావాలని, అయితే మార్షల్స్తోనే సభను నడపాలని ప్రభుత్వం యత్నించిందని పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు.

ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రివిలేజ్ కమిటీ సమావేశమైంది. అసెంబ్లీ వర్షకాల సమావేశాల్లో జరిగిన పరిణామాలపై చర్చ జరిగింది. 45 రోజుల్లో స్పీకర్కు నివేదిక ఇవ్వాలని సభా హక్కుల కమిటీ నిర్ణయించింది.  భేటీ ముగిసిన అనంతరం పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడారు. స్పీకర్, గవర్నర్పై దాడి చేసిన చరిత్ర టీడీపీ నేతలదని, ఎన్టీఆర్ను సీఎం పదవి నుంచి దించాక కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. అందులో మంత్రి యనమల పాత్ర కూడా ఉందని పెద్దిరెడ్డి ఆరోపించారు. 

తాము రెండేళ్లుగా ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నామని, అదే అంశంపై సభలో చర్చకు పట్టుబట్టామన్నారు. అసెంబ్లీలో తాము ఎవరిపైనా దరుసుగా ప్రవర్తించలేదని, ఎమ్మెల్యేలెవరిపైనా చర్యలు తీసుకోవద్దని సమావేశంలో కోరినట్లు పెద్దిరెడ్డి తెలిపారు.


Back to Top