తాడేపల్లి: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను కార్మిక లోకం అడ్డుకోవాలని వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, లేళ్ల అప్పిరెడ్డి పిలుపునిచ్చారు. శనివారం తాడేపల్లిలోని వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి అధ్యక్షతన పార్టీ కార్మిక విభాగం రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వైయస్ఆర్ టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరు గౌతమ్ రెడ్డి, రీజనల్ కో-ఆర్డినేటర్లు, జిల్లాఅధ్యక్షులు పాల్గొన్నారు. వైయస్ఆర్ టీయూసీ ఆధ్వర్యంలో ఈ నెల 27న రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై చేపట్టిన కోటి సంతకాల ఉద్యమం కార్యక్రమంపై అప్పిరెడ్డి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ..ఆయన ఏమన్నారంటే.. కూటమి ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలపై ప్రజల పక్షాన వైయస్ఆర్సీపీ బలంగా పోరాడుతోంది. ఏపీలోని కార్మికవర్గమంతా వైయస్ జగన్గారికి అండగా ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, టూరిజం ప్రైవేటీకరణ, ఆరోగ్యశ్రీ కూడా ప్రైవేటీకరించి ఇలా చంద్రబాబు అన్నీ ప్రైవేటీకరణ చేస్తున్నాడు, మెడికల్ కాలేజీల ప్రైవేటీకణపై మనం ఉద్యమించాలి. కార్మికలోకం ప్రతినిధులుగా మీరంతా ఉద్యమించి ప్రైవేటీకరణను అడ్డుకోవాలి. కార్మికలోకం గొంతెత్తి నినదించాలి. నిర్భందాలు, కేసులు, అరెస్టులు మిమ్మల్ని ఆపలేవు. వైయస్ఆర్ టీయూసీ కమిటీలన్నీ కూడా త్వరగా పూర్తిచేయాలి. పూనూరు గౌతమ్రెడ్డి, వైయస్ఆర్ టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైయస్ఆర్ టీయూసీ బలంగా ఉద్యమిస్తుంది. ఈ నెల 27న రాష్ట్రవ్యాప్తంగా వైయస్ఆర్ టీయూసీ ఆధ్వర్యంలో కోటి సంతకాల ఉద్యమం చేపడుతున్నాం. చంద్రబాబు ప్రభుత్వానికి కార్మికలోకం శక్తి ఏంటో తెలియజేస్తాం. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణతో పాటు నకిలీ మద్యంపై నవంబర్ 10లోపు అన్ని జిల్లాలలో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి ప్రజలను చైతన్యపరుస్తాం. ప్రభుత్వం దిగివచ్చేంత వరకూ మా పోరాటం ఆగదు.