ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం

ఎచ్చెర్ల క్యాంపస్‌: జూన్‌ ఒకటో తేదీన చిలకపాలెం టోల్‌ప్లాజా సమీపంలోని ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించనున్న నియోజకవర్గ స్థాయి ప్లీనరీ సమావేశాన్ని విజయవంతం చేయాలని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర బీసీ సెల్‌ కార్యదర్శి బల్లాడ జనార్దన రెడ్డి కోరారు. ఎచ్చెర్ల మండలంలోని పలు గ్రామాల్లో పార్టీ మండల కన్వీనర్‌ సనపల నారాయణరావుతో కలిసి మంగళవారం పర్యటించారు. ప్రతీ గ్రామం నుంచి పార్టీ కార్యకర్తలు హాజరు కావాలని పిలుపునిచ్చారు. టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలపై విస్తృతంగా చర్చించి, పోలింగ్‌ కేంద్రాల వారీగా ప్రజల్లోకి తీసుకువెళ్లనున్నట్లు చెప్పారు. నిరుద్యోగ యువతకు టీడీపీ ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందన్నారు. 2019లో సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో నిరుద్యోగ భృతి తెరమీదకు తెస్తుందని విమర్శించారు. ఇప్పటికీ నిరుద్యోగ భృతిపై స్పష్టత లేదన్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఇచ్చిన హామీలు, మ్యానిఫేస్టోలోని అంశాలు, ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలపై మహానాడులో చర్చించ లేదన్నారు. అధికార దాహంతో ఆచరణ సాధ్యంకాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందన్నారు. రైతు, డ్వాక్రా రుణమాఫీ నీరుగార్చిందన్నారు. టీడీపీకి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రస్తుతం పేద విద్యార్థులకు ఆధారమైన ప్రాథమిక విద్యను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని దుయ్యబట్టారు. పాఠశాలలు మూసివేయటం అన్యాయమన్నారు.

Back to Top