– మాతృభూమి, మాతృమూర్తి మీద ప్రేమ లేదా?– అసత్య ప్రచారాలు, సొంతడబ్బాలు ఆపితే మంచిది– బాబు హయాంలో ఎవరూ సంతోషంగా లేరు – సీఎం వీసీ అంటే కలెక్టర్లు జడుసుకుంటున్నారు– ప్రజలను అయోమయానికి గురిచేయొద్దు జీడీపీ, జీఎస్డీపీలంటూ సామాన్యుడికి అర్థంకాని మాటలతో కాలక్షేపం చేయడం మాని చంద్రబాబు పాలనపై దృష్టిపెట్టాలని పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి హితవు పలికారు. నిత్యం సొంత ఇమేజ్ను పెంచుకోవడం కోసమే పాకులాడే చంద్రబాబు అసత్య ప్రకటనలతో సామాన్య ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోటస్ పాండ్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తానేదో గొప్ప ఆర్థికవేత్తనని చెప్పుకుంటున్న బాబు పీహెచ్డీ ఎక్కడ చేశారో చెప్పాలన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగడం లేదని పరిపాలన స్తంభించిపోయిందని చెప్పారు. పొంతనలేని మాటలతో.. అసత్య ప్రచారాలతో ప్రజలను మోసం చేయాలని చూస్తే చివరికి నష్టపోయేది మాత్రం ఆయనేనని పేర్కొన్నారు. ఒక సీఎం స్థాయి వ్యక్తి ఇంత దిగజారిపోయి గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. మీ గొప్పల తిప్పలుఇటీవల సీఎం చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో రూ. 13 వేల కోట్ల నల్లధనం వెనక్కిచ్చేశారని అందులో ఒక వ్యక్తి నుంచే రూ. 10 వేల కోట్లు వచ్చిందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తాను గొప్పలు చెప్పుకోవడానికి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను కూడా వదలడం లేదన్నారు. అక్టోబర్ 3న సీబీడీటీ, కేంద్ర ఆర్థిక మంత్రి విడుదల చేసిన ప్రకటన ప్రకారం తాము ఎలాంటి నల్లధనం వివరాలను వెల్లడించలేదని.. అలాంటి వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తాము బయటపెట్టలేదని ఎవరూ నమ్మరాదని ఇచ్చిన ప్రకటనను గుర్తుచేశారు. అలాంటప్పుడు చంద్రబాబుకు ఈ వివరాలు ఎక్కడ్నుంచి వచ్చాయో చెప్పాలన్నారు. ఎలాగూ కేంద్రం, రాష్ట్రంలో తామే అధికారులో ఉన్నారు కాబట్టి విచారణ జరిపించాలని బుగ్గన డిమాండ్ చేశారు. రూ. లక్షా 50 వేల కోట్ల అవినీతికి చక్రవర్తివి...తానేదో గొప్ప ఆర్థికవేత్తనంటూ బీరాలు పోయే చంద్రబాబు అసలు నిజాలు ప్రజలకు అర్థమయ్యే భాషలో వివరించాలన్నారు. రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి కేంద్రానికన్నా ఎక్కువగా ఉందని చంద్రబాబు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అసత్యపు ప్రకటనలతో ఏం సాధించాలనుకుంటున్నారో ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరముందన్నారు. తప్పుడు లెక్కలు చూపించి అప్పులు తెచ్చుకోవడమో లేక తానేదో మేధావినని మీడియాలో డబ్బాలు కొట్టుకోవడానికి తప్ప రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. చంద్రబాబు చెప్పే లెక్కలను చూస్తుంటే వ్యాపారం బాగుంది గానీ రాబడి లేదన్నట్టు ఉందని ఎద్దేవా చేశారు. బాబు అధికారంలోకి వచ్చిన తర్వాత రూ. లక్షా 50 వేల కోట్ల అవినీతి జరిగిందని వివరించారు. ప్రతి పనిలో జరిగిన అవినీతిని ‘ఎంపరర్ ఆఫ్ కరెఫ్షన్’ పేరుతో పుస్తకం ప్రచురించినట్లు తెలిపారు. సీఎంగా చంద్రబాబు అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రతి కాంట్రాక్టులో జరిగిన దోపిడీని వివరంగా అందులో పేర్కొన్నట్లు తెలిపారు. పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్రెడ్డి రాసిన లేఖతోపాటు ఈ పుస్తకాన్ని కూడా ప్రధానికి పంపినట్లు వివరించారు. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అవినీతిలో మొదటి స్థానంలో ఉందని ఎన్సీఏఈ (నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లయిడ్ ఎకానమిక్స్) చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. రాష్ట్రం ఆదాయం అంత బాగా ఉంటే మీ హయాంలో జరిగిన అభివృద్ధిని చూపించమని డిమాండ్ చేశారు. చంద్రబాబు పాలనలో రైతులు, మహిళలు, కూలీలు, నిరుద్యోగులు ఆఖరుకి ఉద్యోగులు కూడా సంతోషంగా లేరన్నారు. లేస్తే వీడియో కాన్ఫరెన్సులని ఉద్యోగుల్ని వేధించుకుని తినడం బాబుకు అలవాటైందని పేర్కొన్నారు. పుష్కరాల పనుల పర్యవేక్షణ కోసం వెళ్లి సాయంత్రం దాకా అక్కడే ఉండి మెట్లు కట్టడం చూసి ఆయనేదో అద్భుతం చేసొచ్చినట్టు మీడియాలో వార్తలు రాయించుకోవడం చూస్తే నవ్వొస్తుందన్నారు. డీఈలు, కిందిస్థాయి అధికారులు చేసే పనిలో చంద్రబాబు పబ్లిసిటీని ఆశించడం తగదన్నారు. సీఎం స్థాయి వ్యక్తి ఇలాంటి చౌకబారు పబ్లిసిటీ కోసం పాకులాడటం తగదన్నారు. సీఎం కుర్చీకున్న విలువను కాపాడాలన్నారు. మీకూ, వెంకయ్యకు అమెరికాలో పుట్టాలనుందా..ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో చంద్రబాబు మట్లాడుతూ తనకు వెంకయ్యకు పుట్టుక ఆప్షన్ ఉండి ఉంటే అమెరికాలో పుట్టాలనుందని చెప్పడాన్ని బుగ్గన ప్రస్తావించారు. ప్రతిఒక్కరూ మరు జన్మంటూ ఉంటే ఇదే నేలపై, అదే తల్లి కడుపున పుట్టాలనుకుంటార ని.. కానీ బాబుకు మాత్రం అమెరికాలో పుట్టాలనుందని కోరుకోవడం చూస్తుంటేనే ఆయనకు మాతృదేశం, మాతృమూర్తి మీద ఉన్న ప్రేమాభిమానాలు తెలిసిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపీ గరీ యసీ అంటే చంద్రబాబు ఇలా అర్థం కావడం సిగ్గుచేటన్నారు. తన పుట్టుకను తనే అసహ్యించుకుంటున్న బాబును చూస్తుంటే జాలేస్తుందన్నారు. మన్నవరం ప్రాజెక్టు కాపాడి చూపించు... రాష్ట్రంలో తీవ్రమైన వెనకబడిన ప్రాంతంగా ఉన్న రాయలసీమను చంద్రబాబు పట్టించుకోవడం ఎప్పుడో మానేశారన్నారు. తాను పుట్టిన సొంత జిల్లా చిత్తూరులో ఉన్న మన్నవరం ప్రాజెక్టును పూర్తి చేసి రాయలసీమ పట్ల తనకున్న చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ఎంతో కష్టపడి సాధించిన మన్నవరం ప్రాజెక్టు ఆగిపోయే పరిస్థితుల్లో ఉంటే బాబు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. బీహెచ్ఈఎల్ భాగస్వామ్యంతో రూ. 6 వేల కోట్లతో నిర్మిస్తున్న ఆ ప్రాజెక్టును ఆపేసేందుకు కేంద్రం సిద్ధమవుతుంటే బాబు ఏం చేస్తున్నారో రాయలసీమ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ఎంత సేపటికీ అది చేశా ఇది చేశా అని చెప్పుకోవడమేనా.. ప్రజలకోసం ఏదైనా చేసేది ఉందా అని అడిగారు. బాబు హయాంలో తన కోటరీకి చెందిన ఏ కొద్దిమందో తప్ప ఎవరూ సంతోషంగా లేరన్నారు. ఆఖరుకి మీ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా మీ ముందు, మీ కొడుకు ముందు నోరెత్తే పరిస్థితి లేదన్నారు. మూల్యం చెల్లించుకుంటావ్... జాగ్రత్త ఐటీ అంటే ఇన్కం ట్యాక్స్ ఒక్కటే కాదు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని బాబుకు తెలిసే నాటికి ప్రపంచంలో చాలా దేశాల్లో చాలా అభివృద్ధి జరిగిపోయిందని బుగ్గన చెప్పకొచ్చారు. ప్రజలకు అర్థం కాని భాషలో మాట్లాడి తాను ఆర్థిక వేత్తనని... సింధు పతకం గెలిస్తే తన ఘనతేనని .. గోపీచంద్కి తానే స్ఫూర్తినిచ్చానని.. కంప్యూటర్ను తానే కనిపెట్టానని.. అబ్దుల్ కలాంని రాష్ట్రపతిని చేశాననడం... రోజుకు 27 గంటలు కష్టపడతానని చెప్పడం.. నిత్యం ఆత్మస్తుతితోతాను గొప్పవాడిగా ప్రచారం చేసుకోవడం చూసి జనం నవ్వుకుంటున్నారని చెప్పారు. ఆఖరుకి పి.వి. నరసింహారావు ప్రధానిగా ఉండగా ప్రవేశపెట్టిన యూఎన్డీపీ పథకాన్ని డ్వాక్రా పథకంగా మార్చి తానే ప్రవేశపెట్టినట్లు కలరింగ్ ఇచ్చుకోవడం సిగ్గు చేటన్నారు. తన ఇమేజ్ను చూసి రాష్ట్రానికి రూ. 4.5 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని చెప్పుకుంటున్న చంద్రబాబు ఎక్కడొచ్చాయో.. వివరాలు తెలియజేయాలని డిమాండ్ చేశారు. దీనిపై ఎవరూ వచ్చి ప్రశ్నించికపోయినా ఏదో ఒక రోజు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.