రెవెన్యూ లోటు భర్తీ చేయాలని 15వ ఆర్థిక సంఘాన్ని కోరాం
విభజన చట్టం హామీల అమలుకు నోచుకోలేదు
14వ ఆర్థిక సంఘం సాకు చూపి ప్రత్యేక హోదా ఇవ్వలేదు
రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని 15వ ఆర్థిక సంఘం అధ్యక్షులకు వివరించాం
వైయస్ఆర్ సీపీ పీఏసీ స భ్యుడు డీఎన్ కృష్ణ
హైదరాబాద్: ఆంధ్రరాష్ట్రం ఆర్థికపరంగా చాలా క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటుందని, అన్ని విధాలుగా ఆదుకోవాలని, రెవెన్యూ లోటును పూడ్చాలని 15వ ఆర్థిక సంఘాన్ని కోరినట్లు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ సభ్యుడు డీఎన్ కృష్ణ చెప్పారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపునఆర్ధిక సంఘానికి ఇచ్చిన నివేదికను రెండుభాగాలుగా పరిగణించవచ్చని చెప్పారు. మొదటిది రాష్ట్రానికి సంబంధించిన అంశం. రెండోది అన్ని రాష్ట్రాలకు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించని అంశాలు ఉన్నాయని చెప్పారు. హైదరాబాద్ లోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం డీఎన్ కృష్ణ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏం మాట్లాడారో.. ఆయన మాటల్లోనే
15 ఆర్థిక సంఘానికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పలు అంశాలను తీసుకువెళ్లాం. హైదరాబాద్ ను కోల్పోయిన నవ్యాంధ్రప్రదేశ్కు అధిక నిధులు కేటాయించాలని కోరాం. రాష్ట్రం ఆర్థికపరంగా చాలా క్లిష్ట పరిస్దితులను ఎదుర్కొంటుంది. రెవెన్యూలోటు భర్తీ చేయాలంటే కేంద్రం సహాయం కావాల్సిన అవసరం ఉంది.
ఆంధ్రరాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం చాలా దురదృష్టకరం. హామీల్లో ప్రాధాన్యత అయింది ప్రత్యేక హోదా.. 14వ ఆర్థిక సంఘం సాకుగా చూపించి హోదాను కేంద్రం ఇవ్వకుండా చేసింది. ప్రత్యేక హోదాను రద్దు చేయాల్సిందిగా 14వ ఆర్థిక సంఘం చెప్పలేదు. అంతేకాకుండా హోదా ఉన్న రాష్ట్రాలకు ఇంకా నిధులు వస్తూనే ఉన్నాయి. ఇదే విషయంపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మొదటి నుంచి పోరాటం చేస్తున్నారు. 15వ ఆర్థిక సంఘం అధ్యక్షుడు ఎన్కే సింగ్ కూడా ఇదే వెల్లడించారు. 14వ ఆర్థిక సంఘాన్ని సాకుగా చూపించి స్పెషల్ కేటగిరి స్టేటస్ ఇవ్వలేదు. కాబట్టి ఈ 15వ ఆర్థిక సంఘం ఎలాగైనా హోదా ఇవ్వాలని, అధిక నిధులు ఇవ్వాలని కోరాం. 2011 జనాభా లెక్కల ప్రకారం కేంద్రం నిధులు కేటాయిస్తే ఏపీకి అన్యాయం జరుగుతుంది.
విభజన అనంతరం ఏపీ హైదరాబాద్ను కోల్పోవడం.. రెవెన్యూ లోటు రావడం తెలిసిందే. 2015–16లో స్టేట్ ఓన్ రెవెన్యూ పర్క్యాపిటా.. తెలంగాణకు రూ. 15,454 వస్తే.. ఆంధ్రరాష్ట్రానికి రూ. 8,979 మాత్రమే వచ్చాయి. అదే విధంగా 2016–17 తీసుకుంటే తెలంగాణకు రూ. 16,534, ఏపీకి రూ. 9,099 మాత్రమే వచ్చింది. ఈ రెవెన్యూ లోటు భర్తీ చేయడానికి కేంద్రం నుంచి సహాయ సహకారాలు అవసరం. ఈ లోటు కాకుండా గత నాలుగేళ్లుగా చంద్రబాబు చేస్తున్న దుబారా వల్ల దయనీయస్థితి ఏర్పడింది. ఫలితంగా రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది.
రెవెన్యూ లోటును భర్తీ చేసేలా గ్రాంటు ఇవ్వడమనేది సంప్రదాయంగా వస్తోంది. 14వ ఆర్థిక సంఘం ఆంధ్ర రాష్ట్రానికి రూ. 22 వేల 113 కోట్లు ఇచ్చారు. 14వ సంఘం రిపోర్టు వచ్చిన తరువాత లోటు పూర్తిగా భర్తీ చేయలేకపోయింది. రెవెన్యూ లోటును దృష్టిలో పెట్టుకుని రాష్ట్రానికి రూ. 60 వేల కోట్లు గ్రాంట్గా ఇవ్వాలని కోరాం. ఏపీ కేంద్రానికి చెల్లించాల్సిన అప్పును పూర్తిగా రద్దు చేయాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరింది. రాష్ట్రంలో పునరుత్పాదకత విద్యుత్ ఉత్పత్తి అధికంగా జరుగుతోంది. దానివల్ల రాష్ట్రానికి రాయితీలు ఇవ్వాలని కోరాం. ఆర్థిక సంఘం నుంచి వచ్చే నిధుల సంఖ్య పెంచాలని కోరినట్లుగా కృష్ణ వివరించారు.