రైతుల‌కు అన్యాయంపై పోరాటం

అనంత‌పురం : హ‌ంద్రీనీవా సాధించిన ఘ‌న‌త దివంగ‌త మ‌హానేత వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి దే అని అనంత‌పురం జిల్లా రాప్తాడు నియోజకవర్గ వైఎస్‌ఆర్ సీపీ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి తేల్చిచెప్పారు. హంద్రీనీవా జల చైతన్య యాత్రలో భాగంగా గురువారం ఆత్మకూరులో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.  హంద్రీ నది నుంచి చిత్తూరు జిల్లా బంగారు పాళ్యం ప్రాంతంలో ఉన్న నీవా వరకు మాత్రమే ఈ నీటిని అందివ్వాల్సి ఉండగా, అక్కడి నుంచి 145 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుప్పంకు నీటిని తీసుకెళ్లేందుకు చంద్రబాబు నాయుడు పన్నాగం పన్నారని మండిపడ్డారు.  ఇందుకోసం కాలువలు ఏర్పాటు చేసేందుకు రూ. 420 కోట్లతో పనులు కట్టబెట్టారని గుర్తు చేశారు. ఈ పనులు పూర్తి అయి నీటి తరలింపులు మొదలైతే జిల్లా వ్యాప్తంగా 3.50 లక్షల ఎకరాలకు ఒక చుక్క నీరు కూడా అందదని, ఒక్క రాప్తాడు నియోజకవర్గంలోనే 77 వేల ఎకరాలకు సాగునీరు అందకుండా పోతుందని వివరించారు.  ఇంత జరుగుతున్నా జిల్లాకు చెందిన  అధికార పార్టీ ప్రజాప్రతినిధులు పెదవి కూడా విప్పడం లేదని మండిపడ్డారు. రైతుల‌కు అన్యాయం చేస్తే ఊరుకోబోమ‌ని తేల్చిచెప్పారు. 
Back to Top