<strong>మాస్టర్ ప్లాన్ పై వివరణ కోసం సదస్సు</strong><strong>అధికారులపై రైతుల ఆగ్రహం</strong><strong>గ్రామాల మధ్యలోంచి రోడ్డు వేయడంపై కన్నెర్ర</strong><strong>స్థలాలు ఎప్పుడు ఇస్తారో చెప్పాలని నిలదీత</strong><br/>గుంటూరుః రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజధాని ప్రాంత రైతులకు కంటిమీద కునుకు కరువైంది. చంద్రబాబు భయానక పాలనతో ప్రజలు నరకయాతనకు అనుభవిస్తున్నారు. మూడు పంటలు పండే పచ్చని పొలాల్లో అగ్గిరాజేసి పేదల బతుకులను చంద్రబాబు ఛిద్రం చేస్తున్నాడు. బలవంతంగా వేలాది ఎకరాల భూములు లాక్కోవడం మొదలు...భూములు ఇవ్వని రైతులను బెదిరింపులకు గురిచేస్తూ పంటలు తగలబెట్టడం వరకు చంద్రబాబు రాక్షస కాండ సాగిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వ భూదోపిడీని నిరసిస్తూ రైతులు, రైతులకు అండగా వైఎస్సార్సీపీ పోరాటాలు కొనసాగిస్తూనే ఉంది. <strong>ఏ ప్లాన్ మాకొద్దు..</strong>ఏపీ రాజధాని పేరుతో చంద్రబాబు ఆడుతున్న నాటకాలపై రైతులు మరోసారి భగ్గుమన్నారు. అమరావతి విషయంలో రైతులు మళ్లీ ఆందోళన బాట పట్టారు. మాస్టర్ప్లాన్ గురించి రైతులకు వివరించేందుకు అధికారులు ఓ సదస్సు ఏర్పాటుచేశారు. దీనికి మొత్తం 29 గ్రామాల రైతులను పిలిచారు. అయితే రైతులు మాత్రం.. సింగపూర్ ఇచ్చిన మాస్టర్ ప్లాన్ విషయం తమకు అక్కర్లేదని, గ్రామాల మధ్యలోంచి రోడ్లు వెళ్తున్నాయా.. లేదా అన్న విషయాన్ని స్పష్టం చేయాలని అధికారులను నిలదీశారు.<br/><strong>స్థలాలు ఎక్కడ ఇస్తారో చెప్పండి..</strong>ఎక్స్ప్రెస్ హైవే పేరుతో ఊరు నడిమధ్య నుంచి రోడ్లు వేస్తున్నారని, ఇప్పటికప్పుడు ఇళ్లు తొలగిస్తే తాము ఎక్కడకు పోవాలని నిలదీశారు. రైతుల ప్రశ్నలకు అధికారులు నీళ్లు నములుతున్నారు తప్ప సరైన సమాధానం చెప్పట్లేదు. మాస్టర్ ప్లాన్ గురించి చెప్పిందే చెబుతున్నారు తప్ప తమ అనుమానాలను నివృత్తి చేయడం లేదని రైతులు వాపోయారు. అదేవిధంగా తమ నుంచి సేకరించిన భూములను అభివృద్ధి చేసిన తర్వాత తమకు స్థలాలు ఇస్తామని గతంలో చెప్పారని, ఆ స్థలాలు ఎక్కడ ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదే విషయంలో రైతులకు, అధికారులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.