పాల్మన్ పేట ఘటనపై నిజనిర్ధారణ కమిటీ

ఊరి ప్రజలపై దాడులకు తెగబడ్డ టీడీపీ గూండాలు
తీవ్రంగా గాయపర్చి సొమ్ము అపహరణ
వైయస్సార్సీపీకి కంచుకోటలా పాల్మన్ పేట
వైయస్సార్సీపీని ఖాళీ చేసేందుకు టీడీపీ కుట్రలు
బాధితులకు అండగా వైయస్సార్సీపీ
ఆరుగురు సభ్యులతో కమిటీ 

విశాఖ జిల్లా: పాల్మన్ పేట ఘటనపై వైయస్సార్సీపీ నిజ నిర్థారణ కమిటీ వేసింది. కమిటీ సభ్యులుగా మోపిదేవి వెంకటరమణ, బొత్స సత్యనారాయణ, దాడిశెట్టి రాజా, చెంగల వెంకట్రావు, గొల్ల బాబూరావు, కోలా గురువులు నియమితులయ్యారు. విశాఖ‌ప‌ట్నం జిల్లా పాల్మ‌న్‌పేట‌లో అత్యంత అరాచ‌కంగా, దుర్మార్గంగా రాష్ట్రంలో చ‌ట్ట‌మే లేన‌ట్టుగా గ‌త కొంత‌కాలంగా జ‌రుగుతున్న దాడుల‌ను వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అత్యంత తీవ్రంగా ప‌రిగ‌ణిస్తోంది. 

ఆర్థిక మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడి త‌మ్ముడి మ‌నుషులు, టీడీపీ గుండాలు పాల్మ‌న్‌పేట గ్రామంపై దాడి చేసి మొత్తం గ్రామాన్ని లూటీ చేయ‌డంతో పాటు, మ‌హిళ‌లు, పిల్ల‌ల‌పై భౌతికంగా దాడులు చేశారు. దాడుల‌కు గురైన వారికి భ‌రోసా ఇవ్వ‌డానికి, నిజ నిర్థార‌ణకు పార్టీ అధ్య‌క్షుడు వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ క‌మిటీని పంపిస్తున్నారు. జులై 1, 2 తేదీల్లో నిజ నిర్థారణ కమిటీ పాల్మన్ పేటలో పర్యటించనుంది. 

కాగా  వైయస్ఆర్  కాంగ్రెస్ పార్టీకి పెట్టని కోటలా ఉన్న పాల్మన్‌పేటను పూర్తిగా నేల మట్టం చేయాలని టీడీపీ కుట్ర పన్నుతోంది.  సర్పంచ్ దోని నాగార్జున, ఎంపీటీసీ గరికిన రమణల ఇళ్లు ప్రధానంగా టార్గెట్ చేశారు. వాటిపై దాడి చేసి ఇళ్లలోని సామాగ్రిని పూర్తిగా ధ్వంసం చేశారు.  ఆ తర్వాత పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు వారి వాహనాలు, ఇళ్లు లక్ష్యం చేసుకున్నారు. దీనంతటికీ ముందుగానే పక్కా వ్యూహం రచించి టీడీపీ రౌడీలు దాడులకు తెగబడ్డారు. ఊరు ఊరిపైనే విచక్షణారహితంగా దాడులు చేశారు. తీవ్రంగా గాయపర్చారు. 

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వారిని ఆ ఊరిలో లేకుండా చేయాలనే ప్రధాన లక్ష్యంతోనే టీడీపీ ఈదురాగతానికి పాల్పడినట్లు బాధితులు చెప్పారు. ఏకంగా 86 వాహనాలను నాశనం చేయడంతో పాటు ఇళ్లల్లోకి చొరబడి బీరువాల్లో ఉన్న నగలు, నగదు దోచుకుపోయారు. చివరికి బియ్యం బస్తాలు కూడా దొమ్మీ చేశారు.
Back to Top