న్యూఢిల్లీ, 6 అక్టోబర్ 2012: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డిని వీలైనంత ఎక్కువ కాలం రాష్ట్ర ప్రజలకు దూరంగా ఉంచాలని కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న దుష్ట రాజకీయ క్రీడ మరోమారు బహిర్గతమైంది. దీనికోసం ఎప్పట్లాగే సీబీఐని పావుగా వాడుకోవడంతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే తనతో నిస్సిగ్గుగా అంటకాగుతున్న ప్రతిపక్ష టీడీపీని కూడా ఢిల్లీ స్థాయిలో ఈ పథకంలో భాగస్వామిగా మార్చుకున్న వైనం పలువురి నోట వినిపిస్తోంది.
జగన్మోహన్రెడ్డిపై ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) చర్యల విషయమై కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరంతో చంద్రబాబు గురువారం ఫోన్లో మంతనాలు జరిపిన విషయం తెలిసిందే. విశ్వసనీయ సమాచారం ప్రకారం గురువారం సాయంత్రం ఈడీ విడుదల చేసిన ఆస్తుల అటాచ్మెంట్ నోట్ను కూడా మధ్యాహ్నానికే టీడీపీ అనుకూల తెలుగు మీడియాకు టీడీపీ ఎంపీల ద్వారా బాబు చేరవేశారు. ఈడీ ఇంకా నోట్ విడుదల చేయక ముందే టీడీపీపీ నేత నామా నాగేశ్వరరావు దాన్ని స్వయంగా తెలుగు మీడియాకు అందజేశారు!
పైగా, నామా నేతృత్వంలో గురువారం మధ్యాహ్నం టీడీపీ ఎంపీల బృందం బాబు లేఖ తీసుకుని చిదంబరంతో భేటీ అవడానికి ముందే ఈడీ నోట్ గురించి యెల్లో మీడియాకు పక్కాగా ఉప్పందింది. సీబీఐ కూడా ఈ విషయంలో తన వంతు పాత్ర పోషించడం ద్వారా యథాశక్తిగా సహకరించింది. శుక్రవారం జగన్మోహన్రెడ్డి బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణకు రానున్న నేపథ్యంలో అంతకు ముందే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈడీ నోట్ విడుదలయ్యేలా పావులు కదిపింది.
కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కూడా టీడీపీని దువ్వే చర్యలను దాచుకోవడానికి ప్రయత్నించడం లేదు. పైగా ఆ పార్టీని మున్ముందు మరింతగా ‘ప్రోత్సహిస్తా’మంటూ సంకేతాలు కూడా ఇస్తోంది. ఏఐసీసీలోకి ఒక ముఖ్య నేత చేసిన వ్యాఖ్యలు కూడా దీనికి అద్దం పడుతున్నాయి. చంద్రబాబుతో కేంద్ర ఆర్థిక మంత్రి మాటామంతీ నిజమేనా అని ప్రశ్నించగా, ప్రస్తుతం తామున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరితోనూ మాట్లాడుతున్నామని కుండబద్దలు కొట్టారాయన. పైగా, ‘ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరితోనూ మాట్లాడాల్సి ఉంటుంది. అదీగాక శత్రువుకు శత్రువు మనకు మిత్రుడే అవుతాడుగా’ అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు కూడా చేశారు.
అక్కడితో ఆగకుండా, ‘చంద్రబాబు కూడా అవినీతిపై పోరాటం చేస్తున్నారుగా’ అంటూ అసలు విషయాన్ని చెప్పకనే చెప్పారు. తృణమూల్ కాంగ్రెస్ నిష్ర్కమణ నేపథ్యంలో యూపీఏ ప్రభుత్వం మెజారిటీ త్రిశంకు స్వర్గంలో ఉన్నందున చిన్న, ప్రాంతీయ పార్టీలను కూడా కూడగట్టుకోవాలన్న వ్యూహం కూడా టీడీపీతో కాంగ్రెస్ దోస్తీకి మరో కారణంగా కన్పిస్తోంది. ప్రభుత్వ మనుగడకు ఢోకా లేకుండా చూసుకోవడంతో పాటు శత్రువుపై దాడికి కూడా ఇది ఉభయతారకంగా పనికొస్తుందన్నది ఏఐసీసీ పెద్దల భావనగా తెలుస్తోంది.