హైదరాబాద్, 14 సెప్టెంబర్ 2012: పెంచిన డీజిల్ ధరలను కేంద్రం వెంటనే తగ్గించాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. గ్యాస్పై నియంత్రణ ఎత్తేయాలని కూడా కోరింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అసమర్థత వల్లే ఈ దుస్థితి తలెత్తిందని పార్టీ సలహాదారు సోమయాజులు అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. 2008 నుంచి ఇప్పటి వరకు అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధర 48 డాలర్లు తగ్గినా డీజిల్ ధరను ఎందుకు పెంచారని కేంద్రప్రభుత్వాన్ని సోమయాజులు సూటిగా ప్రశ్నించారు. డీజిల్ ధర పెంపు కారణంగా ఆర్థిక వ్యవస్థ మరింతగా కుప్పకూలిపోయే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.<br/>కేంద్ర ప్రభుత్వం డీజిల్ ధరను పెంచడం వల్ల రాష్ట్రానికి రూ.500 కోట్లు అదనంగా రాబడి వస్తుందని సోమయాజులు తెలిపారు. అలా వచ్చే సొమ్మును ప్రజలకే తిరిగి చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యుత్ సమస్యలపై అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేయాలని సోమయాజులు అన్నారు. విద్యుత్ సంక్షోభంతో నష్టపోతున్న పారిశ్రామికవేత్తల రుణాలను రీషెడ్యూల్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ సమస్యలపై అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రం వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.