తిరుపతి: రాష్ట్రంలో అవినీతికి ఆధ్యుడు సీఎం చంద్రబాబేనని, ఒక వైపు దోచుకుంటూ మరోవైపు అవినీతి అధికారులపై చర్యలు తీసుకుంటామని చెప్పడం సిగ్గుచేటని వైయస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. ఎమ్మెల్యే పట్టణంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మున్సిపల్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ... టీడీపీ ప్రభుత్వంలో అధికారులకంటే ఎక్కువగా సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు, మంత్రులు, శాసనసభ్యులు అవినీతిలో కూరుకుపోయారని పేర్కొన్నారు.<br/>విశాఖపట్నంలో రెవెన్యూ లెక్కలు తారుమారు చేసి లక్షల కోట్ల ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేశారని దుయ్యబట్టారు. స్వయంగా ఆయన మంత్రివర్గంలోని అయ్యన్నపాత్రుడు ఈ విషయాన్ని తెలియజేసిన విషయాన్ని గుర్తుచేశారు. ముందుగా మంత్రులపై చర్యలు తీసుకుని, ఆ తర్వాత అధికారులను శిక్షించాలని కోరారు. రాష్ట్రాన్ని దోచుకుంటూ అధికారులపై నేరం మోపడం చంద్రబాబుకు అలవాటైపోయిందన్నారు. రాష్ట్రాన్ని అవినీతిలో నంబర్ ఒన్ చేసిన ఘనత ఆయనకే దక్కిందని ఎద్దేవా చేశారు.ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఆవుల అమరేంద్ర, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శులు ఎన్.రెడ్డెప్ప, కొండవీటి నాగభూషణం, సంయుక్త కార్యదర్శి అక్కిసాని భాస్కర్రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు వెంకటరెడ్డియాదవ్, ఎంపీపీ నరసింహులు, వైస్ ఎంపీపీ రామచంద్రారెడ్డి, మున్సిపల్ ఉద్యోగ, కార్మిక సంఘ గౌరవాధ్యక్షుడు ఫకృద్దీన్ షరీఫ్, ఆర్టీసీ వైఎస్సార్ సీపీ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవా«ధ్యక్షుడు జయరామిరెడ్డి పాల్గొన్నారు.