చంద్రబాబు దిష్టిబొమ్మ దహనం

  • వైయస్సార్ విగ్రహ తొలగింపుపై పార్టీ ఆగ్రహం
  • తొలగించిన చోటే తిరిగి ప్రతిష్టించాలని డిమాండ్
  • లేదంటే బాబుకు తగిన మూల్యం తప్పదని హెచ్చరిక
  • బాబుకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు

మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహ తొలగింపును నిరసిస్తూ వైయస్సార్సీపీ  ఆందోళనలు చేపట్టింది. విజయవాడ పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద ఉన్న వైయస్సార్ విగ్రహాన్నినిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం తొలగించడంపై పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పలు చోట్ల వైయస్సార్సీపీ శ్రేణులు బాబు దిష్టిబొమ్మలను దహనం చేశారు. ప్రభుత్వ ఆకృత్యాలపై మండిపడ్డారు. 

విగ్రహాలను తొలగించగలరేమో కానీ, ప్రజల గుండెల్లోంచి  మహానేతను తొలగించలేరని వైయస్సార్సీపీ శ్రేణులు స్పష్టం చేశారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వైయస్సార్‌సీపీ కృష్ణా జిల్లా, నగర అధ్యక్షులు కె.పార్థసారథి, వంగవీటి రాధాకృష్ణ, అధికార ప్రతినిధి జోగి రమేష్, ఎమ్మెల్యేలు ఉప్పులేటి కల్పన, రక్షణ నిధి, మేకా ప్రతాప్ అప్పారావు తదితరులు విగ్రహ తొలగింపుపై కలెక్టర్ అహ్మద్‌బాబును కలిసి వినతి పత్రం అందచేశారు. 

ప్రియతమ నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని తొలగించిన ప్రాంతాన్ని పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. జిల్లా ఇంచార్జ్ మంత్రి హోదాలో విగ్రహ ఏర్పాటుకు  తానే అనుమతిచ్చానని వెల్లడించారు. అన్ని అనుమతులు ఉన్నా.. ప్రభుత్వం కుట్రపూరితంగా విగ్రహాన్ని తొలగించిందని ఆయన మండిపడ్డారు. తొలగించిన చోటే విగ్రహాన్ని పునరుద్ధరించాలని పెద్దిరెడ్డి డిమాండ్ చేశారు.

మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని తొలగించడం కోట్లాది మంది ప్రజల అభిమానాన్ని గాయపరిచిందని వైయస్సార్సీపీ నేత గొల్ల బాబూరావు అన్నారు. విగ్రహాల తొలగింపుపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. గతంలో ఏ రాజకీయ నాయకుడు ఇలా మాట్లాడలేదన్నారు.ఇప్పటికైనా తొలగించినచోటే వైయస్సార్ విగ్రహాన్ని పునఃప్రతిష్టించాలని లేదంటే చంద్రబాబు సర్కారు తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. 



తాజా వీడియోలు

Back to Top