చీకటి ఒప్పందాలకే చంద్రబాబు ఢిల్లీ పర్యటన

అమలాపురం (తూ.గో. జిల్లా) :

చీకట్లో చిదంబరాన్ని కలిసి చీకటి ఒప్పందాలు చేసుకోవడానికే చంద్రబాబు నాయుడు ఢిల్లీ యాత్రకు సిద్ధమవుతున్నారని శ్రీమతి షర్మిల ఆరోపించారు. వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అ‌ధినేత శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి బెయిల్‌ అంశం మరోసారి తెరమీదకు రావడంతో కుట్రలు చేయడమే పనిగా ఆయన ఢిల్లీ వెళుతున్నారని ఆమె విమర్శించారు. ‘చంద్రబాబుగారూ.. జగన్మోహన్‌రెడ్డి బెయిల్ విషయం మళ్లీ తెరమీదికి వచ్చిందన్న కారణంతోనే మీరు ఇప్పుడు ఢిల్లీకి వెళ్లడం లేదా? మళ్లీ చీకట్లోనే చిదంబరాన్ని కలిసి చీకటి ఒప్పందాలు చేసుకోవడానికి కాదా మీరు ఢిల్లీకి వెళుతున్నది? కాంగ్రె‌స్ వారితో కలిసి కుట్రలు పన్నడానికి కాదా చంద్రబాబూ మీరు ఢిల్లీకి వెళుతున్నది?’ అని‌ శ్రీమతి షర్మిల ప్రశ్నించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే డిమాండ్‌తో సమైక్య శంఖారావం బస్సు యాత్ర  11వ రోజు శుక్రవారం రాత్రి తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో శ్రీమతి షర్మిల ప్రసంగించారు.

‘గతంలోనూ ఇలాగే జగనన్నకు ఒక్క రోజులో బెయిల్ ఇస్తున్నారనగా.. మీ ఎం‌పిలను పంపి ‘సాక్షి’ ఆస్తులను అటాచ్ చేయించి బెయి‌ల్‌ను అడ్డుకున్నారు. జెడ్‌ ప్లస్‌ భద్రతలో ఉన్న మీరు పోలీ‌స్ కమాండోలు కూడా అవసరం లేదని చెప్పి.. మీడియా కళ్లు గప్పి మరీ చిదంబర రహస్య భేటీలు జరిపారు. మళ్లీ అందుకే కదా బాబూ ఇప్పుడు మీరు ఢిల్లీ వెళుతున్నది? లేకపోతే జెడ్ ప్ల‌స్ కేటగిరీ ఉన్న మీరు.. ఒక దొంగలా అందరి కళ్లూ గప్పి.. అహ్మ‌ద్ పటే‌ల్‌ను కలవడానికి వెళుతున్నారా? లేకపోతే సోనియా గాంధీ కాళ్ల మీదపడి జగన్మోహన్‌రెడ్డికి ఎలాగైనా సరే బెయిల్ రాకుండా చూడండి అని వేడుకోవడానికి వెళుతున్నారా?’ అని శ్రీమతి షర్మిల నిలదీశారు.

దమ్ముంటే జవాబు చెప్పండి :
‘ఇప్పుడు చంద్రబాబు ఢిల్లీకి వెళ్తారట. తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖను వెనక్కు తీసుకోకుండా ఢిల్లీకి వెళ్లి ఏం ప్రయోజనం చంద్రబాబూ? నిజం చెబుతారని కాదుగానీ.. అసలు మీరు ఢిల్లీకి ఎందుకు వెళుతున్నారో చెప్పండి. తెలంగాణకు అనుకూలంగా మీరు ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోకుండా.. ఎందుకు ఢిల్లీకి వెళ్తున్నారో మీకు దమ్ముంటే సమాధానం చెప్పండి. మొన్న సమైక్య రాష్ట్రం కోసం ఉద్యమిస్తున్న కొంత మంది చంద్రబాబు దగ్గరకు వెళ్లి ఆయన యాత్రను అడ్డుకున్నారట. దానికి చంద్రబాబు వారి మీద మండిపడ్డారట. మీ అంతు చూస్తానని బెదిరించారట. మీ ఇళ్లలోనే కాదు, మీ ఊళ్లలో ఎలా ఉంటారో చూస్తానని చంద్రబాబు వారిని బెదిరించారట. చంద్రబాబూ.. మీరు మీ ఇష్టమొచ్చినట్లు మాట్లాడతారా? అసలు ఏమనుకుంటున్నారండీ మీ గురించి మీరు?'

విభజనకు చంద్రబాబే అసలు కారకుడు :
'తెలంగాణను ఇచ్చేసుకుంటే ఇచ్చేసుకోండి అని ఒక బ్లాంక్ చెక్కు మీద సంతకం పెట్టినట్టు లేఖలు రాసిచ్చేశారు చంద్రబాబు. కాంగ్రె‌స్ పార్టీ ఈ రోజు మన రాష్ట్రాన్ని విభజించే సాహసం చేస్తోందంటే దానికి కారణం చంద్రబాబు విభజనకు పలికిన మద్దతే. హత్య చేసి ఆ శవం మీదే పడి వెక్కివెక్కి ఏడ్చినట్టు చంద్రబాబు తెలంగాణకు అనుకూలంగా లేఖ‌ ఇచ్చేసి ఇప్పుడు మొసలి కన్నీళ్లు కారుస్తున్నారు. మన రాష్ట్రంలో 60 శాతం మంది ప్రజలకు ఎంతో అన్యాయం జరుగుతుంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఈయన చేయాల్సిన పని పాలకపక్షం కాలర్ పట్టుకొని నిలదీయడం.‌ కానీ, దిగ్విజయ్ సింగ్ ప్రకటన చేసిన వెంటనే ఈయన ప్రె‌స్‌మీట్ పెట్టి.. హైదరాబా‌ద్‌ను రూ.4 లక్షల కోట్లకు అమ్మకానికి పెట్టారంటే ఇంతకంటే దుర్మార్గుడు, ఇంతకంటే ద్రోహి ఇంకొకరు ఉంటారా?'
'రాష్ట్ర విభజనకు వైయస్ఆర్ కాంగ్రె‌స్, ‌సిపిఎం, ఎంఐఎం పార్టీలు విభజనకు అనుకూలమని ఏనాడూ చెప్పలేదు. చంద్రబాబుకు ఏమాత్రం చిత్తశుద్ధి, నిజాయితీ ఉన్నా తెలంగాణకు తాను కూడా వ్యతిరేకం అని ఈ మూడు పార్టీల పక్షాన నాలుగో పార్టీగా నిలబడాలి. ప్రజలకు క్షమాపణ చెప్పి తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖ వెనక్కి తీసుకోవాలి. ఆయన, ఆయన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా రాజీనామాలు చేసి నిరసన తెలియజేయాలి.'

తెలిసినా కిరణ్‌కుమార్‌రెడ్డి గోప్యంగా ఉంచారు :
'కేవలం ఓట్లు, సీట్ల కోసం, టిఆర్‌ఎస్‌ను తమలో కలుపుకొనైనా సరే కేంద్రంలో లబ్ధి పొంది రాహుల్ గాంధీని ప్రధా‌నిగా చేసుకోవాలనే ఏకైక లక్ష్యంతో కోట్ల మంది ప్రజలకు అన్యాయం చేయడానికి పూనుకొంది కాంగ్రెస్ పార్టీ. తెలుగువారి ఓట్లు దండుకొని తెలుగువారిపైనే వేటు వేసింది. తెలుగువారి భిక్షతో కేంద్రంలో, రాష్ట్రంలో గద్దెనెక్కి కూర్చొని తెలుగువారికే వెన్నుపోటు పొడిచింది. ఇంత జరుగు‌తుంటే సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి దిష్టిబొమ్మలా కూర్చున్నారు. మన రాష్ట్రాన్ని చీల్చుతున్నారనే సంగతి కిరణ్‌కు ఎప్పుడో తెలుసు. ఆయినా దానికి అడ్డు చెబితే తన పదవి పోతుందనుకొని అడ్డు చెప్పలేదు, దిగ్విజయ్‌సింగ్ వచ్చి మన రాష్ట్రాన్ని చీల్చుతున్నామని ప్రకటన చేసేంత వరకు కిర‌ణ్‌కుమార్‌రెడ్డి ఆ విషయాన్ని గోప్యంగా ఉంచారు.'

సంకేతాలు రాగానే వైయస్ఆర్‌ కాంగ్రెస్ రాజీనామాలు‌ :
'ఎలాంటి పరిష్కారమూ చూపించకుండానే హఠాత్తుగా మన రాష్ట్రాన్ని విడగొడుతున్నారన్న సంకేతాలు వచ్చిన వెంటనే వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ‌ నాయకులందరూ రాజీనామాలు చేశారు. గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ, అధ్యక్షుడు శ్రీ జగన్మోహన్‌రెడ్డి రాజీనామాలు చేసి.. నిరాహార దీక్షలు కూడా చేశారు. లేఖల మీద లేఖలు రాస్తూ మన రాష్ట్రాన్ని విడగొట్టొద్దని, అన్యాయం చేయొద్దని ఈ రోజు వరకు పోరాటం చేస్తూనే ఉన్నారు. కానీ సీమాంధ్రలోని ఎంతమంది కాంగ్రెస్, టిడిపి నాయకులు రాజీనామాలు చేసి ప్రజల తరఫున గొంతెత్తారు?’ అని శ్రీమతి షర్మిల ప్రశ్నించారు.

తాజా వీడియోలు

Back to Top