ఆదోని: వైయస్ఆర్సీపీ దళిత ఎమ్మెల్యే ఐజయ్యను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవమానపర్చడం దారుణమని వైయస్ఆర్సీపీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు కల్లుపోతుల సురేష్ అన్నారు. శనివారం తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 8న కర్నూలు జిల్లాలోని ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవం చేశారని, ఈ సభలో దళిత ఎమ్మెల్యే ఐజయ్యను మాట్లాడనివ్వకుండా మైక్ కట్ చేసి అవమానించారని మండిపడ్డారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన పనుల గురించి ఐజయ్య సమావేశంలో వివరిస్తాడనే ఉద్దేశంతోనే ఆయన్ను మాట్లాడనివ్వకుండా చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలోనే రెండుసార్లు ఇలా అర్ధాంతరంగా ఐజయ్యను మాట్లాడనివ్వకుండా మైక్ కట్ చేయించి అవమానపర్చాడని ఇప్పటికి మూడుసారి దళిత ఎమ్మెల్యేను చంద్రబాబు ఇలా అవమానించడం ఆయనకు దళితుల పట్ల వున్న చిన్నచూపు ఏపాటిదో అర్థమవుతోందన్నారు. దళితుల ఓట్లతోనే గద్దెనెక్కి దళితులను కించపరచడం చంద్రబాబు నైజమని తేలిపోయిందన్నారు. ఎస్సీలంటే ఇంత చులకనా..? అదే ఎస్సీలు రాబోయే ఎన్నికల్లో నీకు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. <br/>