<strong>కర్నూలు, 10 డిసెంబర్ 2012:</strong> రెండుసార్లు రాష్ట్ర ప్రజల తిరస్కరణకు గురైన ఇప్పుడైనా సిఎం పీఠం ఎక్కాలన్న ఆతృతతో టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తానేమి చేస్తున్నారో, ఏది మాట్లాడుతున్నారో కూడా తెలియడం లేదని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు భూమా నాగిరెడ్డి ఎద్దేవా చేశారు. పదవి కోసం చివరికి దిగజారిపోయి కుళ్ళు రాజకీయాలు చేసేందుకు కూడా ఆయన వెనకాడడంలేదని దుయ్యబట్టారు. సిఎంగా ప్రజా తిరస్కరణకు గురైన చంద్రబాబు చివరికి ప్రతిపక్ష నేతగా కూడా విఫలమయ్యారని భూమా నాగిరెడ్డి వ్యాఖ్యానించారు. అసలు ఒక పార్టీకి అధ్యక్షుడుగా ఉండడానికి కూడా చంద్రబాబు తగడని ఆయన అన్నారు. కర్నూలో సోమవారం మీడియాతో ఆయన మాట్లాడారు. టిడిపిని కాంగ్రెస్ పార్టీకి తాకట్టు పెట్టి ఆ పార్టీకి తొత్తుగా చంద్రబాబు మారిపోయారని భూమా నాగిరెడ్డి మండిపడ్డారు.<br/>చంద్రబాబు దిగజారుడు రాజకీయం ఎఫ్డిఐ ఓటింగ్లో స్పష్టమైపోయిందని భూమా నాగిరెడ్డి అన్నారు. ఎన్టీఆర్ విగ్రహం విషయంలో కేంద్ర మంత్రి పురందేశ్వరి రాజకీయం చేస్తున్నారని ఆరోపిస్తున్న చంద్రబాబు తా చేసేది ఏమిటని సూటిగా ప్రశ్నించారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందని భూమా పేర్కొన్నారు.