<strong>బాబు స్వలాభం కోసమే స్విస్ ఛాలెంజ్</strong><strong>వేల కోట్ల రూపాయలు దోచుకునేందుకు ప్లాన్</strong><strong>సింగపూర్ కంపెనీలేమైనా మదర్ థెరిస్సా ట్రస్టులా</strong><strong>దేశంలోని కంపెనీలు మీకు పనికిరావా..?</strong><strong>బాబుకు నోట్ల సంచులు మోసేవారే కావాలా..?</strong><strong>వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ</strong><br/><strong>హైదరాబాద్ః</strong> రాజధాని అమరావతిని స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో నిర్మించేది కేవలం వేల కోట్ల రూపాయలు దండుకునేందుకేనని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అరోపించారు. సింగపూర్ ప్రభుత్వానికి సంబంధించిన కంపెనీకి స్విస్ ఛాలెంజ్ మోడల్లో ఇవ్వబోతున్నామని 45 రోజులు ప్రచారం చేశారు. ఎవరూ ఛాలెంజ్ చేయకపోతే తిరిగి వారికే ఇస్తామని చెప్పడం సిగ్గు చేటన్నారు. ఇందులో పారదర్శకత లోపించిందని బొత్స విమర్శించారు. ఏదో ఒక గందరగోళాన్ని సృష్టించి లబ్ధి పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. ప్రజా రాజధాని అని పేరు పెట్టి వారిని దోచుకుందామన్న ఆలోచన తప్ప ప్రభుత్వానికి మరొకటి లేదని దుయ్యబట్టారు. సింగపూర్ కంపెనీ వాళ్లు బాబుపై అభిమానంతో వచ్చారని చెప్పడం హాస్యాస్పదమన్నారు. సింగపూర్ కంపెనీలు ఏమైనా మదర్ థెరిస్సా ట్రస్టులా అని బాబును ప్రశ్నించారు. <strong><br/></strong><strong>విజయకేల్కర్ కమిటీ నివేదిక ఏమైంది..?</strong>ప్రభుత్వ రంగ సంస్థలు ముందుగా వెళ్లాలంటే ఏవిధమైన నిర్ణయాలు తీసుకోవాలన్న దానిపై కేంద్రం గత సవత్సరం 8మందితో కేల్కర్ కమిటీని నియమించిందన్నారు. దీన్ని క్షుణ్ణంగా పరిశీలించి 2015 నవంబర్లో కమిటీ ఒక నివేదకను సైతం అందజేసిందని ఆయన తెలిపారు. స్విస్ ఛాలెంజ్ విధానాన్ని ఎంకరైజ్ చేయవద్దని కమిటీ చెప్పిందన్నారు. స్విస్ ఛాలెంజ్లో ఒక కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నాం. ఒక ఒప్పందంతో వారికి అప్పజెప్పుతున్నాం. దీనిని కాదని ఎవరైనా ఛాలెంజ్ చేసి ముందుకు వస్తే వారికి కేటాయిస్తామని ముఖ్యమంత్రి చెప్పడం దారుణమన్నారు. హైదరాబాద్ లో పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో బొత్స సత్యనారాయణ మాట్లాడారు. <br/><strong>భారతదేశంలో పనికొచ్చే ఒక్క కంపెనీ లేదా బాబూ?</strong>భారతదేశంలో అన్నీ పనికి మాలిన కంపెనీలు ఉన్నాయనడం ఎంతవరకు సమంజసమని అధికార టీడీపీని బొత్స నిలదీశారు. దేశంలో ఉన్న కంపెనీలు, కాంట్రాక్టర్లు పనికి రావుగానీ... బాబు కోసం మూటలు మోసేవారు, బాబుకు వత్తాసు పలికేవారు, బాబు కోసం నోట్ల సంచులు తెచ్చేవారు నీతిమంతులా అని కడిగిపారేశారు. రాజధానికి వైయస్సార్సీపీ వ్యతిరేకం కాదని. రాజధాని పేరిట జరుగుతున్న లోపాయికారి ఒప్పందాలు, అవినీతికి వ్యతిరేకమని మరోసారి స్పష్టం చేశారు. భవిష్యత్తులో రాష్ట్రంలో ప్రభుత్వం మారి ఈ ఒప్పందాన్నిరద్దు చేస్తే .....ఆ కంపెనీకి సదరు ప్రభుత్వం భారీ ఎత్తున నష్టపరిహారం ఇవ్వాలని చెప్పడం సిగ్గు చేటన్నారు. అంటే భవిష్యత్తులో టీడీపీ ఉంటుందన్న నమ్మకం వారికే లేదని ఎద్దేవా చేశారు. <br/><strong>రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటున్నాయి..!</strong>రాష్ట్ర ప్రభుత్వం ఏవిధంగా దోపిడికి పాల్పడుతుందో ఇప్పటికైనా ఆలోచన చేయాలని బొత్స ప్రజలను కోరారు. అభివృధ్ధి ముసుగులో మరింత అవినీతిని చేసేందుకు బాబు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఈ ఒప్పందం వల్ల రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దీనిని వెంటనే విస్మరించుకోవాలని బొత్స డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారమే రాజధాని నిర్మాణం జరగాలని వైయస్సార్సీపీ డిమాండ్ చేస్తుందన్నారు. లోపలి ఒప్పందాలకు సహకరించిన ప్రతిఒక్కరూ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు.