బాపూజీ మృతితో సభ వాయిదా

ఐదురోజుల శాసన సభా కార్యక్రమాలు నాలుగో రోజున కొండా లక్ష్మణ బాపూజీ మృతికి సంతాపం తెలిపిన తదుపరి శనివారానికి వాయిదా పడ్డాయి. ఆయన స్మృతి చిహ్నాన్ని నిర్మించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ప్రకటించారు. బాపూజీ శుక్రవారం ఉదయం కన్నుమూశారు. స్పీకర్ సంతాప సందేశాన్ని చదివారు. సభ్యులంతా రెండు నిమిషాలు మౌనం పాటించారు. 

సభా ప్రారంభంలో వివిధ అంశాలపై గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో స్పీకర్ రెండు సార్లు వాయిదా వేశారు. తెలంగాణ తీర్మానన్ని ప్రవేశపెట్టాలంటూ తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు గట్టిగా కోరడంతో సభా నిర్వహణ సాద్యం కాలేదు. రెండు సార్లు వాయిదా పడిన సభ మూడో సారి సమావేశమైనప్పుడు బాపూజీ మరణ వార్త తెలిసింది. 
సభలో వివిధ పార్టీల సభ్యులు కొండా లక్ష్మణ బాపూజీని కొనియాడుతూ ప్రసంగించారు. నిరంతరం ఆయన తెలంగాణ కోసం పరితపించారని తెలిపారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు, ఎమ్మెల్యే శ్రీమతి వైయస్ విజయమ్మ మాట్లాడుతూ బాపూజీ నిబద్ధత కలిగిన రాజకీయవేత్త అని నివాళులర్పించారు.  తెలంగాణ ప్రాంత ప్రజల సంక్షేమానికి ఆయన తన జీవితాన్ని ధారపోశారని ప్రశంసించారు.




Back to Top