అవిశ్వాసం పెట్టమంటే.. డ్రామాలాడుతున్నారు

కర్నూలు:

ప్రధాన రోడ్లన్నీ జనంతో కిటకిటలాడాయి. షర్మిలకు అభివాదం చేసి ఆమెకు స్వాగతం చెప్పేందుకు వచ్చిన జనాలను అదుపు చేయడానికి పోలీసులు, వ్యక్తిగత సిబ్బంది చెమటోడ్చాల్సి వచ్చింది. ఉదయం చిన్నమ్మ సర్కిల్ వద్ద, సాయంత్రం కొండారెడ్డి బురుజు వద్ద జరిగిన సభల్లో ఆమె ప్రసంగించారు. ‘కిరణ్‌కుమార్‌రెడ్డికి సీఎం పదవి రావడం రాజన్న చలువ కాదా? రాజన్న రెక్కల కష్టం మీద ఢిల్లీ పీఠం మీద కూర్చుని పరిపాలన చేస్తున్న వాళ్లే ఆయన్ను దోషిగా నిలబెట్టాలనుకోవడం దుర్మార్గం కాదా’ అని ఆమె నిలదీశారు.
     టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. కిరణ్ కుమార్‌రెడ్డి ప్రభుత్వంతో కుమ్మక్కై అవిశ్వాసం పెట్టకుండా ‘మీకోసం’ అంటూ ప్రజల్లోకి వచ్చి డ్రామాలాడుతున్నారని షర్మిల ధ్వజమెత్తారు. ఇది చేతకాని ప్రభుత్వం.. అధికారంలో ఒక్క క్షణం కూడా ఉండటానికి వీలు లేదని చెబుతూనే చంద్రబాబు దాన్ని కాపాడుతున్నారని విమర్శించారు. పాదయాత్ర 35వ రోజు బుధవారం కర్నూలు నగరంలో సాగింది. జగన్‌మోహన్‌రెడ్డి అరెస్టుకు నిరసనగా ప్రజలు నల్ల బ్యాడ్జీలు ధరించి వెల్లువలా తరలి వచ్చారు.
     రాజన్న వందల కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను తెలుసుకుని ఉచిత విద్యుత్తు, ఆరోగ్యశ్రీ, 108, ఫీజు రీయింబర్సుమెంట్, వృద్ధాప్య పింఛన్ పథకాలను పెట్టారన్నారు. ప్రతి పేదింటికి రాజన్న తెచ్చిన సం క్షేమ ఫలం చేరిందనీ, ఆ వేళ ఈ పథకాలను ఎద్దేవా చేసిన చంద్రబాబు.. ‘మీకోసం’ అంటూ బయల్దేరి ఈ పథకాలను తానే అమలు చేస్తానని నక్క వినయం ప్రదర్శిస్తున్నారనీ చెప్పారు.  ‘పులిని చూసి.. నక్క ఎన్ని వాతలు పెట్టుకున్నా పులి అవుతుందా’ అంటూ చంద్రబాబు వైఖరిని షర్మిల ప్రశ్నించారు. 35వ రోజు బుధవారం పాదయాత్రలో కల్లూరు మండలంలోని సెయింట్ క్లారెట్ పాఠశాల నుంచి బయల్దేరిన షర్మిల పాదయాత్ర 12 కిలోమీటర్ల మేర సాగింది. గురువారం కర్నూలు జిల్లాలో మరొక 3.70 కి.మీ. ప్రయా ణం చేసి షర్మిల తుంగభద్ర బ్రిడ్జి మీదుగా మహబూబ్‌నగర్ జిల్లాలోకి అడుగు పెడతారు. మూడు జిల్లాల్లో పాదయాత్ర పూర్తి చేసుకుని తెలంగాణ జిల్లాల్లోకి అడుగు పెట్టడం సంతోషంగా ఉందని షర్మిల అన్నారు.

భారీగా తరలివచ్చిన నేతలు
     షర్మిల పాదయాత్రకు బుధవారం భారీ సంఖ్యలో ప్రజాప్రతినిధులు తరలివచ్చారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.యస్.విజయమ్మ సాయంత్రం కర్నూలు నగరంలో జరిగిన బహిరంగ సభకు హాజరై ఉద్వేగంగా ప్రసంగించారు. దివంగత ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి, ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి తదితరులు వరుసగా మూడోరోజు యాత్రలో పాల్గొన్నారు. ఎమ్మెల్యేలు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, అమరనాథ్ రెడ్డి, బాలరాజు, రాజేశ్, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, మేకతోటి సుచరిత, కాపు రామచంద్రారెడ్డి, శోభానాగిరెడ్డి, బాలనాగిరెడ్డి యా త్రలో కదంతొక్కారు. ఎమ్మెల్సీ దేవగుడి నారాయణ రెడ్డి, మాజీ మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మారెప్ప, మాజీ ఎంపీ భూమా నాగిరె డ్డి, మాజీ ఎమ్మెల్యేలు గోనె ప్రకాశ్‌రావు, గౌరు చరితారెడ్డి, జంగా కృష్ణమూర్తి, కె. నారాయణస్వామి, ప్రసాద్‌రాజు, సాయిప్రసాద్‌రెడ్డి, ఎస్. మనోహర్, మాజీ ఎమ్మెల్సీలు ఎస్.వి. మోహన్‌రెడ్డి, రెహమాన్, కర్నూలు జిల్లా పార్టీ కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి తదితరులు షర్మిల వెంట నడిచారు.

Back to Top