<strong>చంద్రబాబు హిందూధర్మాన్ని మలినం చేస్తున్నాడు</strong><strong>కొడుకును సీఎం చేయాలని భువనేశ్వరి చేయించారు!</strong><strong>దోషులను తప్పించేందుకే చంద్రబాబు కమిటీ</strong>హైదరాబాద్: లోకేష్కు అర్ధంతరంగా ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టడం కోసమే ఆయన తల్లి భువనేశ్వరి రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల్లో క్షుద్రపూజలు జరిపించివుంటారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. డిసెంబర్ 26వ తేదీన విజయవాడ దుర్గగుడిలో, డిసెంబర్ 18వ తేదీన శ్రీకాళహస్తి దేవాలయంలో కాళభైరవ గుడిలో మాసంతం, మద్యం పెట్టి జంతువులను బలిచేసి తాంత్రిక పూజలు చేసినట్లుగా పత్రికల్లో వచ్చిందన్నారు. తాంత్రిక పూజలపై నిజనిర్ధారణ కమిటీ వేశారని, దాని వల్ల ఉపయోగం లేదని, ప్రభుత్వానికి అనుకూలంగా కమిటీ నివేదిక ఇవ్వనుందని అంబటి జోస్యం చెప్పారు. ఈ మేరకు హైదరాబాద్ లోటస్పాండ్లోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో అంబటి రాంబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు కుటుంబం లోకేష్ కోసం దేవాలయాల్లో తాంత్రిక పూజలు చేశారని లోకమంతా కోడైకూస్తుందన్నారు. హిందూ ధర్మానికి సంబంధించిన విషయంపై చంద్రబాబు నిజనిర్ధారణ కమిటీ వేయడం దోషులను తప్పించడమేనన్నారు. క్షుద్ర పూజలు ఎవరు నిర్వహించారో వాస్తవాలు తెలియాలంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. <br/>సింహాచలం, తిరుపతి ఇంకా రాష్ట్రంలోని అనేక పుణ్యక్షేత్రాల్లో చంద్రబాబు కుటుంబం తాంత్రిక పూజలు నిర్వహించిందో లేదో తెలియాలంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. ఇది కోట్లాది మంది హిందువుల మనోభావాలకు సంబంధించిన విషయమన్నారు. రాజ్యాధికారం, అనుకున్న పనులను దక్కించుకోవడం కోసం తాంత్రిక పూజలు చేయడాన్ని సినిమాల్లో చూశాం.. పురణాల్లో చదివామన్నారు. కానీ సాక్షాత్తు నారావారి పాలనలో హిందూ ధర్మన్ని మలినం చేసే విధంగా క్షుద్రపూజలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది రాష్ట్రానికే అరిష్టమన్నారు. <br/>వాస్తవాలు కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు తూతూ మంత్రంగా ఒక కమిటీని వేశారని అంబటి విమర్శించారు. గతంలో తహసీల్దార్ వనజాక్షిపై దాడి ఘటనపై కమిటీ, ట్రాన్స్పోర్టు ఆఫీసర్పై ఎంపీ, ఎమ్మెల్యే దౌర్జన్యం చేస్తే కమిటీ, చంద్రబాబు షూటింగ్ పిచ్చి వల్ల గోదావరి పుష్కరాల్లో 29 మంది చనిపోతే దానిపై ఒక కమిటీ, విశాఖ భూ కుంభకోణంపై ఒక కమిటీ వేశారన్నారు. కానీ ఒక్క కమిటీ కూడా వాస్తవాలు చెప్పలేదన్నారు. చేతులు దులుపుకునేలా చంద్రబాబు కమిటీ వేశారన్నారు. ఎవరు వాస్తవాలు దాచిపెట్టినా దుర్గమ్మ తల్లి మాత్రం వదిలిపెట్టదన్నారు. తప్పుడు విధానాలకు వ్యతిరేకంగా మీపై ఉగ్రరూపం చూపిస్తుంది చంద్రబాబూ అంటూ హెచ్చరించారు. గతంలో రాజధాని నిర్మాణం కోసం 50 దేవాలయాలను కూల్చివేశారన్నారు. చంద్రబాబు వేసిన కమిటీని ఖండిస్తున్నామని, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి వాస్తవాలు తెలపాలని డిమాండ్ చేశారు.