హైదరాబాద్) కేంద్రంలో వెంకయ్య నాయుడు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కలిసి కుమ్మక్కై రాష్ట్రాన్ని నట్టేట ముంచారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. ఏపీ కి ప్రత్యేక హోదా లేదని చావుకబురు చల్లగా చెప్పటం పచ్చి మోసం అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఓటుకి నోటు కేసులో అరెస్టు కాకుండా ఉండేందుకు చంద్రబాబు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని ఆయన అన్నారు. కేంద్రం నుంచి టీడీపీ మంత్రుల్ని ఉపసంహరించాలని, రాష్ట్రం నుంచి బీజేపీ మంత్రుల్ని సాగనంపాలని, నిజాయితీ గా నిరసన తెలపాలని ఆయన డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీతో సహా అన్ని పార్టీల నాయకుల్ని ఢిల్లీకి తీసుకొని వెళ్లి, పోరాటాన్ని సలపాలని సూచించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తమ పార్టీ ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉందని అంబటి వ్యాఖ్యానించారు.