<br/><strong>స్పీకర్ ఫార్మాట్లో రాజీనామాలకు సిద్ధం: ఎంపీలు</strong><strong>నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా కోసం పోరాడుతుంది వైయస్ జగన్ ఒక్కరే</strong><strong>ప్రత్యేక హోదా ఎవరు ఇస్తే వారికే మద్దతిస్తాం</strong><strong>ఎగతాలిగా మాట్లాడిన చంద్రబాబు వైయస్ జగన్ దారిలోకే వచ్చారు</strong><strong>టీడీపీ ఎంపీలూ రాజీనామా చేస్తే మంచి సందేశం పోతుంది</strong><strong>వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్రెడ్డి</strong><br/><strong>గుంటూరు:</strong> ప్రత్యేక హోదా ఇవ్వకుండా లోక్సభ నిరవధిక వాయిదా పడిన వెంటనే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలమంతా రాజీనామా చేస్తామని వైయస్ఆర్ సీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు మేకపాటి రాజమోహన్రెడ్డి అన్నారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో ముప్పాళ్ల గ్రామం ప్రజా సంకల్ప క్యాంపు కార్యాలయంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డి పార్టీ ఎంపీలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా లోక్సభ, రాజ్యసభల్లో వ్యవహరించాల్సిన విషయాలపై ఎంపీలతో చర్చించారు. భేటీ అనంతరం పార్టీ ఎంపీలు మీడియాతో మాట్లాడారు. పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని విధాలుగా నష్టపోయిందని, ప్రత్యేక హోదా ఇస్తేనే రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని చెప్పి రాష్ట్రాన్ని విభజించారన్నారు. మార్చి 2వ తేదీన స్పెషల్ స్టేటస్ను అమలు చేయాలని ప్లానింగ్ కమిషన్కు ప్రభుత్వం పంపించిందన్నారు. అప్పుడు 13వ ఆర్థిక సంఘం అమలులో ఉందని స్పష్టం చేశారు. ఏప్రిల్ 1వ తేదీ 2015లో 14వ ఆర్థిక సంఘం అమలులోకి వచ్చిందన్నారు. కానీ బీజేపీ, టీడీపీ ప్రభుత్వాలు 14వ ఆర్థిక సంఘం అభ్యంతరం చెబుతుందంటూ నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. <br/><strong>మెజార్టీ ఉన్నా.. హోదా సాధనలో టీడీపీ విఫలం...</strong><br/>ప్రత్యేక హోదా ఇస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని వైయస్ఆర్ సీపీ అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డి మొదటి నుంచి పోరాటం చేస్తున్నారని మేకపాటి గుర్తు చేశారు. 13 జిల్లాలో తిరిగి యువతను చైతన్య పర్చడం, ధర్నాలు, దీక్షలు చేశారన్నారు. గుంటూరు వేదికగా ఆమరణ నిరాహారదీక్ష కూడా చేశారన్నారు. పలు బహిరంగ సభల్లో 13వ ఆర్థిక సంఘం ప్రకారమే హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారన్నారు. మార్చి 1వ తేదీన కలెక్టరేట్ల ముట్టడి, 5వ తేదీన ఢిల్లీలో పార్టీ నేతలతో ధర్నాలు, ఆ తరువాత లోక్సభలో అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెడుతూ.. పోరాటం ఉధృతం చేశామన్నారు. చంద్రబాబు నాలుగేళ్లుగా ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. టీడీపీకి మెజార్టీ ఎంపీలున్నా హోదా సాధనలో విఫలమైందని విరుచుకుపడ్డారు. హోదా విషయంలో రాజీపడేది లేదని, ఎవరు ప్రత్యేక హోదా ఇస్తే వారికి వచ్చే ఎన్నికల్లో మద్దతు ఇస్తామని చెప్పారు. <br/><strong>వెన్నులో వణుకుపుట్టి ఎన్డీయే నుంచి బయటకు...</strong><br/>వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటాన్ని ఎగతాలి చేసి మాట్లాడిన చంద్రబాబు.. ప్రతిపక్ష వైయస్ జగన్ బాటలోకే వచ్చారని మేకపాటి అన్నారు. మొదట్లో అవిశ్వాసం ప్రవేశపెడితే మద్దతు లేదని చులకన చేసి మాట్లాడారని మండిపడ్డారు. ఆ తరువాత వైయస్ జగన్ రాసిన లేఖ ద్వారా జాతీయ పార్టీల నేతలను కలిసి మద్దతు కూడగట్టడంతో బాబు వెన్నులో వణుకుపుట్టి ఎన్డీయే నుంచి బయటకు వచ్చి ప్లేట్ ఫిరాయించారన్నారు. వైయస్ఆర్ సీపీ అవిశ్వాసానికి మద్దతు ఇస్తున్నామని అసెంబ్లీ సాక్షిగా చెప్పి 16వ తేదీ ఉదయం విరమించుకున్నారన్నారు. ప్రత్యేక హోదా సాధించే వరకు వెనక్కు తగ్గేది లేదని, హోదా కోసం ఎంత వరకైనా పోరాటం చేస్తామన్నారు. పార్లమెంట్ వాయిదా పడిన వెంటనే స్పీకర్ ఫార్మాట్లో రాజీనామాలు చేయాలని వైయస్ జగన్ ఆదేశించారన్నారు. పార్టీ అధినేత ఆదేశాల మేరకు స్పీకర్ ఫార్మాట్లో రాజీనామాలు చేస్తామని ఎంపీలు స్పష్టం చేశారు. చంద్రబాబు ఇప్పటి వరకు వైయస్ జగన్ బాటలోనే నడిచారని, ఇప్పుడు కూడా టీడీపీ ఎంపీలతో రాజీనామా చేయిస్తే బాగుంటుందని, అందరం కలిసి రాజీనామాలు చేస్తే స్పష్టమైన సందేశం పోతుందన్నారు. సమావేశంలో ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్, పెద్దిరెడ్డి మిథున్రెడ్డి, వైయస్ అవినాష్రెడ్డి, విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డిలు ఉన్నారు.