పుణ్యం బాబుది పాపం భక్తులది


 

పుణ్యం చేస్తే స్వర్గం, పాపం చేస్తే నరకం అని నమ్ముతారు చాలా మంది. అయితే పాపం....ఏ పాపం చేయకుండానే ఇన్నాళ్లూ చంద్రబాబు గారు బోలెడు అభాండాలు మోసి నరకం చవి చూసారు. పుష్కరాలకు భారీగా నిధులు పెట్టి, ప్రచారాల కోసం కోట్లు ఖర్చుపెట్టి, ప్రజల భక్తిమీద శ్రద్ధపెట్టి, ప్రపంచమే నివ్వెర పోయేలా పుష్కర ఏర్పాట్లు చేపట్టి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ జరక్కుండా పోలీసులను కాపలాపెట్టి, జరిగితే కాపాడేందుకు అంబులెన్సులను దగ్గర్లో పెట్టి, గోదావరిలో దూకే దారులను ప్రజలకు చూపెట్టి, కించిత్ ఆటంకం కూడా కలగకుండా భక్తులకు పుష్కర పుణ్యాన్ని పువ్వుల్లో పెట్టి అందిస్తే...

చివరకు అందరూ కలిసి ఆయన్ని ఆడిపోసుకున్నారు. ఏర్పాట్లలో లోపాలున్నాయన్నారు. ఘాట్ల వద్ద సౌకర్యాలు లేవన్నారు. పోటెత్తిన భక్తుల సంఖ్యను అంచనా వేయలేకపోయారన్నారు. భక్తులను మళ్లించి ఒకే చోట తాకిడి పెరగకుండా చూడలేకపోయారన్నారు. బాబుగారి షూటింగ్ కోసం గంటలు గంటలు వెయిట్ చేయించారన్నారు. సిబ్బంది, పోలీసులు సరిగ్గా లేక తొక్కిసలాట జరిగి అమాయకుల ప్రాణాలు పోయాయన్నారు. బాధితులకోసం గంటలు గడిచినా అంబులెన్సులు రాలేదన్నారు. ఇప్పుడు ఆ దుర్ఘటనపై చంద్రబాబు నియమించిన సోమయాజులు కమీషన్ అన్నీ అబద్ధాలే చెబుతోందంటున్నారు. ఇందులో చంద్రబాబు ప్రమేయం కాని, ప్రభుత్వ నిర్లక్ష్యంగానీ లేదని కమిటీ తేలిస్తే నెత్తీ నోరు కొట్టుకుంటున్నారు...మీడియా ప్రచారం చూసి భక్తులు ఒకేసారి వెళ్లి దుర్ఘటనకు కారణం అయ్యారంటే నోరెళ్లబెడుతున్నారు...

మీడియాలో ఆయనొస్తున్నాడు అంటూ ఎన్నికల ప్రచారం చేస్తే ప్రజలు దాన్ని చూసి, నమ్మి ఓట్లేయాలి. మీడియాలో చంద్రబాబు పాలన బ్రహ్మాండంగా ఉందని చెబితే అవునని తలూపాలి. మీడియాలో బాబుభేష్, బాబే బంగారం అని భజన చేస్తుంటే మరో ఆలోచన లేకుండా విశ్వసించాలి. అనుభవంలో చాణుక్యుడు, అపర మేధావి, అమరావతిని ఆరునెలల్లో కట్టేస్తాడంటే అలవోకగా నమ్మేయాలి. అంతేకానీ పుష్కరాలకెళితే పుణ్యం వస్తుందని మీడియా చెబితే ఎందుకు నమ్మినట్టు? పుష్కరాలకు స్వాగతం అని చంద్రబాబు భారీ బానర్లు పెట్టి పిలిస్తే ఎందుకు వెళ్లినట్టు? బ్రహ్మముహూర్తమో భయంకర ముహూర్తమో అని డిబేట్లు పెట్టి భక్తులకు సమాచారం ఇస్తే దాన్ని వ్యాపారం అని అర్థం చేసుకోకుండా పోలోమని ఎందుకు పరిగెత్తాల్ట? పుష్కరాల దుర్ఘటన సమయంలో అక్కడే ఉండి చంద్రబాబు ఎన్ని సహాయక చర్యలు చేశాడని...!!!
అయిపోయిన షూటింగ్ గురించి, తెరవని గేట్ల గురించి, గంటలు గంటలు నిరీక్షించిన భక్తుల గురించి, ఒక్కసారిగా జరిగిన తోపులాట గురించి, లేని సిబ్బంది గురించి, రాని అబులెన్సు గురించి ఇక్కడ చర్చ అనవసరం. జరిగిన దుర్ఘటనకు నూటికి నూట తొంభై శాతం తప్పు భక్తులదే...ఏడాదిపైగా కూలంకషంగా విచారించి సోమయాజులు కమిటీ ఇచ్చిన నివేదికకు సాక్ష్యాలేవి అని అడక్కండి...!! 
సిసి కెమెరా రికార్డులు చూపమని నిలదీయకండి...!!
సాక్షులతో బహిరంగ విచారణకు పట్టుబట్టకండి...!!
ఎందుకంటే...పుష్కరాల్లో జరిగిన పాపం ముమ్మాటికీ భక్తులదే....భక్తులకు పుణ్యాన్ని ప్రసాదించిన ఫలం చంద్రబాబుదే...

 

 

 

 

  


Back to Top