తాడేపల్లి: పదో తరగతి పేపర్ వేల్యూయేషన్ లో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని వైయస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అసమర్థత కారణంగా రాష్ట్రంలో విద్యాశాఖ నిర్వీర్యమైందని మండిపడ్డారు. విద్యార్ధులకు కీలకమైన పదోతరగతి పరీక్షల్లో మూల్యాంకనంలో చోటుచేసుకున్న దారుణాలకు మంత్రి లోకేష్ బాధ్యత వహించి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పదోతరగతి జవాబుపత్రాల రీవెరిఫికేషన్ పూర్తయ్యే వరకు ట్రిపుల్ ఐటీ ప్రవేశాలను నిలుపుదల చేసి, ప్రతిభగల విద్యార్ధులకు న్యాయం చేయాలని కోరారు. ఇంకా ఆయనేమన్నారంటే... పదో తరగతి పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థుల్లో చాలా ఆందోళన మొదలైంది. ఆరు సబ్జెక్టుల్లో 90 శాతం మార్కులు సాధించిన విద్యార్థులు, ఒక సబ్జెక్టులో మాత్రం దారుణంగా 15, 20 మార్కులతో ఫెయిలైపోయారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు రీవెరిఫికేషన్, రీవేల్యూయేషన్కి దరఖాస్తు చేసుకున్నారు. అందులో 66,363 మంది దరఖాస్తులు చేసుకోగా, 11 వేల పేపర్లలో ఫలితాలు తారుమారయ్యాయి. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం యర్రగుంట్ల మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదివిన గంగిరెడ్డి మోక్షిత అనే విద్యార్థిని సాంఘిక శాస్త్రంలో 21 మార్కులతో ఫెయిలైనట్లు ఫలితాలొచ్చాయి. రీవెరిఫికేషన్ తర్వాత ఆ బాలిక 84 మార్కులతో పాసైంది. బాపట్ల జిల్లా కొల్లూరు ఉన్నత పాఠశాలలో చదివిన తేజస్వినికి అన్ని సజ్జెక్టుల్లోనూ 90కిపైగా మార్కులొచ్చాయి. సాంఘిక శాస్త్రంలో మాత్రం 23 మార్కులతో ఫెయిలైనట్లు ఫలితాలొచ్చాయి. రీవెరిఫికేషన్లో మాత్రం 96 మార్కులొచ్చాయి. కర్నూలు జిల్లాలోని సంగాల ఉన్నత పాఠశాలలో చదివిన ప్రేమ వర్ష అనే విద్యార్థినికి సోషల్ స్టడీస్లో 77 మార్కులొచ్చాయి. రీవెరికేషన్కి దరఖాస్తు చేసుకుంటే 93 మార్కులొచ్చాయి. అన్ని సజ్జెక్టుల్లో 90 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థులు, నిర్లక్ష్యంగా చేసిన మూల్యాంకనం ద్వారా తీవ్రంగా నష్టపోయారు. ఇంటర్ మూల్యాంకనంలోనూ నిర్లక్ష్యమే కేవలం పదో తరగతి పరీక్షలు మాత్రమే కాదు, ఇంటర్మీడియట్ పరీక్షల్లో సైతం ఇదే జరిగింది. విజయవాడకి చెందిన దండే రాజేశ్వరికి 530 మార్కులకు 430 మార్కులే వచ్చాయి. అన్ని సబ్జెక్టుల్లో 90 శాతం మార్కులొస్తే, ఇంగ్లిష్లో మాత్రం కేవలం 5 మార్కులే రావడంతో ఆ విద్యార్థి షాక్ కు గురై రీవెరిఫికేషన్ చేయించుకుంటే 95 మార్కులొచ్చాయి. మరీ ఇంత ఘోరమా? కాకినాడకి చెందిన పరిమళశ్రీ అనే విద్యార్థినికి గణితం ఫస్ట్ పేపర్ రీవెరిఫికేషన్లో మంచి మార్కులు సాధించింది. కొన్ని ప్రశ్నలకు మార్కులే వేయకుండా వదిలేస్తే రీవెరిఫికేషన్ కి దరఖాస్తు చేసుకుని మంచి ఫలితం సాధించింది. ఇవన్నీ వైయస్ఆర్సీపీ సొంతంగా చెప్పే లెక్కలు కావు. ఇవన్నీ వాస్తవాలు, టీడీపీ అనుకూల పత్రిక ఈనాడులో కూడా వచ్చిన వార్తలే. పరీక్షల్లో ఉత్తీర్ణులు కాలేదని సున్నిత మనసుతో విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్న ఈరోజుల్లో, ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం చాలా తప్పు. రికార్డుల కోసం ప్రభుత్వం పాకులాడి విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంది. రాబోయే ఎంసెట్ ఫలితాల్లో ఇంకెన్ని ఘోరాలు చూడాల్సి ఉంటుందోనని ఆందోళన విద్యార్థుల్లో మొదలైంది. లోకేష్ క్షమాపణలు చెప్పాలి పేపర్ మూల్యాంకనం కోసం గతంలో మూడు వారాల సమయం తీసుకుంటే వారం రోజుల్లోనే రికార్డు స్థాయిలో మూల్యాంకనం పూర్తి చేశామని గొప్పలు చెప్పుకోవడానికే ప్రభుత్వం పాకులాడింది. రికార్డుల కోసం విద్యార్థుల జీవితాలను పణంగా పెట్టారు. కనీసం టీచర్ల సంఖ్యను పెంచడానికి ప్రయత్నించకుండా వారిపై భారం మోపింది. మూల్యాంకనంలో కనీసం జాగ్రత్తలు పాటించకపోవడం వల్లనే ఈ సమస్యలు తలెత్తాయి. వారి గొప్పల కోసం విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టారు. దీనికి మంత్రి లోకేష్, సీఎం చంద్రబాబులలో ఎవరు బాధ్యత తీసుకుంటారు? మంత్రి నారా లోకేష్ దీనికి బాధ్యత వహించి విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పాలి. సకల శాఖల మంత్రిగా మారి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయడానికి పెట్టిన శ్రద్దలో పదో వంతైనా విద్యావ్యవస్థ మీద పెట్టుంటే ఈ తప్పులు జరిగేవి కావు. విద్యాశాఖ నిర్వహణలో విఫలమైన లోకేష్ తక్షణం రాజీనామా చేయాలి. తన తప్పులను ఎత్తి చూపినప్పుడు సరిదిద్దుకోవాల్సిందిపోయి ఎదురుదాడి చేయడంతోనే లోకేష్ ప్రాధాన్యత ఇచ్చాడు. గతంలో మా ప్రభుత్వ హయాంలో రీవెరిఫికేషన్ చేసినప్పుడు మార్కుల్లో తేడా చాలా స్వల్పంగా ఉండేది. ఇలా ఫెయిలైన విద్యార్థులకు 90 మార్కులొచ్చిన చరిత్ర లేదు. అవగాహన, డబ్బులున్న విద్యార్థులే రీవెరిఫికేషన్ కి దరఖాస్తు చేసుకున్నారు. ఇంకా ఎక్కువ మంది చేసుకుని ఉంటే ఫలితాలు ఇంకా ఘోరంగా ఉండేవి. దరఖాస్తు రుసుం వెనక్కి ఇవ్వాలి రీవెరిఫికేషన్ కోసం విద్యార్థుల నుంచి దాదాపు రూ. 6 కోట్లకు పైగా వసూలు చేశారు. ఆ డబ్బునంతా దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు తిరిగి చెల్లించాలి. దీంతోపాటు రీవెరిఫికేషన్, రీ కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు ట్రిపుల్ ఐటీలు, ఏపీ రెసిడెన్షియల్, మోడల్ స్కూల్స్లో ప్రవేశాలను నిలిపివేయాలి. రీవెరిఫికేషన్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు కూడా వాటిల్లో ప్రవేశాలు కల్పించాలి. కొడుకు లోకేష్ చేసిన తప్పుకి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా బాధ్యత వహించాలి.