అమరావతి భూకుంభకోణంపై సీబీఐ దర్యాప్తు జరపాలి

రాజ్య‌స‌భ‌లో ఎంపీలు పిల్లి సుభాష్ చంద్ర‌బోస్‌, మోపిదేవి, అయోధ్య రామిరెడ్డి విజ్ఞ‌ప్తి
 

న్యూఢిల్లీ: అమరావతి భూకుంభకోణంపై సీబీఐ దర్యాప్తు జరపాలని వైయ‌స్ఆర్ ‌సీపీ ఎంపీలు రాజ్యసభలో కోరారు. ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ రాజ్యసభలో మాట్లాడుతూ.. 'అమరావతిలో చంద్రబాబు నాయుడు ధనవంతులకే స్థలాలిచ్చారు. అక్కడ పేదలకు కూడా ఇళ్లస్థలాలు ఇవ్వాలని సీఎం వైయ‌స్ జగన్ ప్రయత్నించారు. అలాంటి ప్రయత్నాలను న్యాయస్థానాలు సైతం అడ్డుకోవడం సరికాదు. పేదవాళ్లు, పెద్దవాళ్ల పక్కన నివాసం ఉండడానికి అనర్హులా..?. భారత రాజ్యాంగం కల్పించిన సమానత్వపు హక్కు ఇదేనా..?. అందుకే ఆ భూ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు జరపాలని కోరుతున్నాం. అంతర్వేదిలో దేవుడి రథం విషయంలో మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.   

అంతర్వేది ఆలయం శిథిలావస్థలో ఉంటే దాన్ని మాజీ సీఎం వైయ‌స్ఆర్  అభివృద్ధి చేశారు. మా సీఎం దృష్టిలో అందరూ సమానమే. బడుగు వర్గాలకు చెందిన మేమిద్దరం ఇక్కడ ఎంపీలుగా నిలబడ్డమే అందుకు నిదర్శనం. కొందరు విబేధాలు రెచ్చగొట్టేందుకు ఎవరో కొందరు చేసిన పనిని సీఎంకు ఆపాదించడం దురదృష్టకరం. ప్రధాన మంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్పందించాలని కోరుతున్నాం. న్యాయమూర్తులపై నిందారోపణలున్నాయి. కాబట్టి కచ్చితంగా సీబీఐతో విచారణ జరిపించాల్సిన అవసరం ఉంద‌ని పిల్లి సుభాస్‌ చంద్రబోస్‌ అన్నారు.  

సమగ్ర న్యాయ విచారణ జరగాలి:  మోపిదేవి వెంకటరమణ
అమరావతి అవకతవకలపై సమగ్ర న్యాయ విచారణ జరగాలి. భూసేకరణ నిబంధనలకు విరుద్ధంగా బడుగు బలహీనవర్గాల, పేదల భూములు సేకరించారు. ఈ క్రమంలో టీడీపీ నేతలు అనేక అక్రమాలకు పాల్పడ్డారు.  

నిష్పక్షపాత దర్యాప్తు ఉండాలి:  అయోధ్య రామిరెడ్డి
రాష్ట్రంలో అన్ని దర్యాప్తులకు మోకాలడ్డుతున్నారు. ప్రాథమిక ఆధారాల ప్రకారం సిట్‌, సబ్‌ కమిటీ ఏర్పాటైంది. అమరావతిలో అవకతవకలు జరిగాయని ఈ కమిటీ ద్వారా వెల్లడైంది. దీనిపైన న్యాయవిచారణ జరగాల్సిందే. నిష్పక్షపాత దర్యాప్తు తప్పనిసరిగా ఉండాలి. 

తాజా వీడియోలు

Back to Top