చిత్తూరు: ఐదు దశాబ్దాలుగా దళితుల్ని ఓటు వేయకుండా అడ్డుకున్నారని చంద్రగిరి వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ రీపోలింగ్ జరుగుతున్న ఐదు కేంద్రాల్లో దళితుల్ని ఓటు వేయనివ్వడం లేదని ఫిర్యాదు చేసినా జిల్లా ఎన్నికల అధికారులు,కలెక్టర్లు పట్టించుకోలేదన్నారు.ఫిర్యాదుకు సంబంధించి అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు. దళితులకు ప్రత్యేకంగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని గతంలోనే ఫిర్యాదు చేశాం.. అయినా కలెక్టర్ పట్టించుకోలేదని చెప్పారు. పోలింగ్ రోజు దళితులను ఓటు వేయనీయడం లేదని, పోలింగ్ కేంద్రంలో వీడియో ఫుటేజీ తనిఖీ చేసి అన్ని విషయాలు చూడమని ఆరోజే ఫిర్యాదు చేశామన్నారు. మొత్తం ఏడు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ చేయాలని ఫిర్యాదు చేశామని తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో ఆ రోజు ఒకే వ్యక్తి ఓటు వేస్తున్న విజువల్స్ సీసీటీవీ పుటేజీలో స్పష్టంగా ఉంది..అయినా కూడా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్పందించలేదన్నారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ రీపోలింగ్కు బాధ్యత వహించాలని కోరారు. చిత్తూరు కలెక్టర్, ఎస్పీ చేసిన తప్పిదాల వల్లే ఈ రీపోలింగ్ వచ్చిందన్నారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఓటు హక్కును దళితులు స్వేచ్ఛగా వినియోగించుకునే విధంగా వాతావరణం కల్పించాలని ప్రజాస్వామ్యం,రాజ్యాంగ విలువల్ని కాపాడేవిధంగా అధికారులు వ్యవహరించాలన్నారు