తిరుపతి: అధికారంలో ఉన్నప్పుడు ఆలయాలను కూల్చిన నీచ చరిత్ర చంద్రబాబుదని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి ధ్వజమెత్తారు. ఆలయాలపై దాడుల వెనుక టీడీపీ కార్యకర్తలు ఉన్నారని అందరికీ తెలుసన్నారు. తిరుపతిలో ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మతాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేసే నీచ సంస్కృతికి ప్రతిపక్షాలు దిగజారాయన్నారు. గతంలో బీజేపీని విమర్శించిన పవన్ కల్యాణ్.. ప్రస్తుతం ఆ పార్టీకే మద్దతు తెలపడం, ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం శోచనీయమన్నారు. మత ప్రేరేపణలతో అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించాలని ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నామని ఎమ్మెల్యే భూమన మండిపడ్డారు. అభివృద్ధి, సంక్షేమంపై మాట్లాడకుండా దేవుడ్ని అస్త్రంగా చేసుకుంటున్నారని, భగవంతుడిపై విశ్వాసం ఉన్నవారు ఇలాంటి వ్యాఖ్యలు చేయరన్నారు. దేవుడ్ని రాజకీయ వనరుగా మార్చుకున్నవారే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారని మండిపడ్డారు. ప్రతిపక్షాల నీచ రాజకీయాలకు దేవుడే శిక్ష వేస్తాడన్నారు.