ఆరోగ్యశ్రీని భ్రష్టుపట్టించిన వ్యక్తి చంద్రబాబు

నిధుల్లోనే కాదు.. రోగాల్లో కూడా కోత విధించారు

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే అప్పలరాజు

వెలగపూడి: విద్యా, వైద్యం, ఆరోగ్యానికి సంబంధించి గవర్నర్‌ చాలా బ్రహ్మాండమైన విషయాలను చెప్పారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అప్పలరాజు అన్నారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలు ఆరోగ్యంగా ఉంటే రాష్ట్రం బాగుపడుతుందని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గట్టిగా నమ్మారన్నారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ప్రజారోగ్యమే పరమావధిగా ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చి ఆదర్శంగా నిలిచారన్నారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని గత చంద్రబాబు తుంగలో తొక్కిందని మండిపడ్డారు. 2014–15లో ఆరోగ్యశ్రీకి రూ. 650 కోట్లు అవసరం అని ప్రపోజల్‌ పెడితే రూ. 150 కోట్ల కోత విధించారని, అదేవిధంగా 2015–16 సంవత్సరానికి రూ. 860 కోట్లు ప్రపోజల్స్‌ పెడితే మళ్లీ రూ. 500 కోట్లు మంజూరు చేశారని, 2016–17లో రూ.910 కోట్లు ప్రపోజల్స్‌ పెడితే మళ్లీ అదేకోత విధించి రూ. 500 కోట్లు మంజూరు చేశారన్నారు. 2017–18లో రూ. 1450 కోట్ల ప్రపోజల్స్‌ పెడితే రూ. వెయ్యి కోట్లు రిలీజ్‌ చేసి అందులో కూడా రూ. 400 కోట్లు బకాయిల రూపంలో ముంచేశారన్నారు. నిధుల్లోనే కాకుండా జబ్బుల్లో కూడా కోత విధించారని ఆవేదన వ్యక్తం చేశారు. 1400 రోగాలు ఆరోగ్యశ్రీ కింద ఉంటే 400ల రోగాలకు కోత విధించి 1044 రోగాలకు పరిమితం చేశారన్నారు. వీటిల్లో 133 రోగాలకు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే వైద్యం చేయించుకోవాలని నిబంధన పెట్టారన్నారు. చంద్రబాబు మూలాన ఆరోగ్యశ్రీ వర్తించే ప్రైవేట్‌ ఆస్పత్రుల యాజమాన్యాలు సమ్మె చేయడం మొదలు పెట్టాయన్నారు. ఐదేళ్లలో అనేక ఖాళీ పోస్టులను అలాగే ఉంచారన్నారు. సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్స్‌ మొత్తం 2207 అవసరం అయితే ఖాళీలు 434 ఉన్నాయని, స్టాఫ్‌ నర్సులు 4935 పోస్టులు ఉంటే 1210 పోస్టులు ఖాళీగా ఉంచారన్నారు. ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టులు 253 పోస్టులు, ఫార్మసిస్టుల పోస్టులు 241 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు.

 

Back to Top