ఒక పార్టీకి, వర్గానికి చెందిన వ్యక్తిగా నిమ్మగడ్డ వైఖరి

చంద్రబాబు చెప్పినట్లుగా రమేష్‌కుమార్‌ వ్యవహరిస్తున్నారు

రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలో వ్యక్తిగా ఎస్‌ఈసీ వ్యవహరించాలి

ప్రభుత్వాన్ని సంప్రదించకుండా రాజకీయ పార్టీలను భేటీకి పిలవడం సరైందేనా..?

వైయ‌స్ఆర్ సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎమ్మెల్యే అంబ‌టి రాంబాబు

తాడేపల్లి: ఒక పార్టీకి, ఒక వర్గానికి చెందిన వ్యక్తిగా నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ వ్యవహరిస్తున్నారని, వారు చేస్తున్న తప్పును సరిదిద్దుకొని రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలోని వ్యక్తిగా ఆయన వ్యవహరించాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలపై  రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయాలను తీసుకోవాలని సుప్రీంకోర్టు చెప్పిందని, కానీ, ఎస్‌ఈసీ ఆ ఆదేశాలను పట్టించుకోవడం లేదన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ.. ‘స్టేట్‌ ఎన్నికల కమిషనర్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ప్రభుత్వ చీఫ్‌ సెక్రటరీని సంప్రదించలేదు. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా రాజకీయ పార్టీలను భేటీకి పిలవడం సరైందేనా..? చంద్రబాబు చెప్పినట్లే నిమ్మగడ్డ వ్యవహరిస్తున్నారు. పక్షపాత ధోరణి అవలంబిస్తున్నారు. టీడీపీ నేతలను సంప్రదించి సమావేశాలు పెడుతున్నారు. అన్ని పార్టీలను సమన్వయం చేసుకోకుండా నిమ్మగడ్డ ముందుకెళ్తున్నారు. ఒక పార్టీకి, వర్గానికి చెందిన వ్యక్తిగా ఆయన వ్యవహరిస్తున్నారు. 

సమావేశానికి 18 రాజకీయ పార్టీలను పిలిచినట్లుగా పత్రికల్లో చూశాం. భౌతికదూరం పాటిస్తూ 18 మందిని ఒకే మీటింగ్‌ హాల్‌లో కూర్చోబెట్టి అభిప్రాయాలు తీసుకోవచ్చు. బహుశా కోవిడ్‌కు భయపడి వన్‌ టు వన్‌ మీటింగ్‌ నిర్ణయం తీసుకుంటే.. సమావేశానికి 18 మందిని ఒకేచోట కూర్చోబెట్టి మాట్లాడలేని పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో నెలకొని ఉన్నప్పుడు ఎన్నికలు రీఓపెన్‌ చేయాల్సిన అవసరం లేదు. 

కోవిడ్‌ వంకతో ఒకరికి తెలియకుండా మరొకరితో రహస్యంగా మాట్లాడాలని చంద్రబాబు చెప్పినట్లుగా నిమ్మ‌గ‌డ్డ రాజకీయం చేస్తున్నారనే అభిప్రాయం మాకు కలుగుతుంది. రాష్ట్రంలో మూడు కోవిడ్‌ కేసులు కూడా లేని రోజుల్లో.. ఏ రాజకీయ పార్టీలను అడిగి ఎన్నికలు వాయిదా వేశారో చెప్పాలి. చంద్రబాబు రాజకీయంలో నిమ్మగడ్డ రమేష్‌ భాగమేనని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి’ అని అంబటి రాంబాబు అన్నారు.

Back to Top