విషప్రచారం టీడీపీ డీఎన్‌ఏలోనే ఉంది

ఎన్నికలు దగ్గర పడుతున్నాయని దుష్ప్రచారాలు

దీని వెనుక చంద్రబాబు హస్తం ఉందని నమ్ముతున్నాం

సీరియస్‌గా యాక్షన్‌ తీసుకుంటామని సీపీ హామీ ఇచ్చారు

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి

హైదరాబాద్‌: అసత్య ప్రచారాలు చేయడం తెలుగుదేశం పార్టీ డీఎన్‌ఏలోనే ఉందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని రాజకీయంగా ఎదుర్కోలేక దుష్ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి వైయస్‌ షర్మిలపై తెలుగుదేశం పార్టీ విషప్రచారాలు చేస్తుందని ధ్వజమెత్తారు. హైదరాబాద్‌ సీపీకి ఫిర్యాదు చేసిన అనంతరం సజ్జల మీడియాతో మాట్లాడారు. ఇప్పుడే కాదు 2014 ఎన్నికల ముందు కూడా తెలుగుదేశం పార్టీ ఇలాంటి అసత్య ప్రచారాలు చేసిందన్నారు.

ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయని మరోసారి ఇలాంటి దుష్ప్రచారాలకు తెరతీశారన్నారు. ప్రతిపక్ష పార్టీ మానసిక సై్థర్యం దెబ్బతియాలనే ఉద్దేశంతో వైయస్‌ షర్మిలపై సోషల్‌ మీడియాలో పుకార్లు పుట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న ఈ దుర్మార్గాన్ని చంద్రబాబు ఎప్పుడు ఖండించలేదో దీని వెనుక ఆయన హస్తం ఉందని బయటపడిందన్నారు. 

ఆంధ్రప్రదేశ్‌ పోలీసులపై నమ్మకం లేదు కాబట్టే హైదరాబాద్‌ సీపీని కలిసి ఫిర్యాదు చేశామని సజ్జల అన్నారు. ఏపీ డీజీపీ లక్షణాలే అక్కడి పోలీసుల్లో ఉన్నాయని, పొలిటికల్‌ బానిసల్లా పనిచేస్తున్నారన్నారు. ఇది మహిళలందరిపై జరుగుతున్న దాడిగా పరిగణించాలన్నారు. ఫిర్యాదు కాపీని చూసిన అనంతరం హైదరాబాద్‌ సీపీ షాక్‌కు గురయ్యారన్నారు.

గతంలో ఇచ్చిన కాపీని కూడా తెప్పించుకొని సీరియస్‌గా యాక్షన్‌ తీసుకుంటామని హామీ ఇచ్చారన్నారు. దుష్ప్రచారాలు చేయడానికి తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు డైరెక్షన్‌లో ఒక వింగ్‌ పనిచేస్తుందన్నారు. అత్యంత నీచమైన, చేతగాని దద్దమ్మలు చేసే పని ఇదన్నారు. 

Back to Top