తాడేపల్లి: విద్యార్థులకు వైయస్ఆర్సీపీ అండగా నిలుస్తూ ఫిబ్రవరి 5న తలపెట్టిన 'ఫీజుపోరు' కార్యక్రమం పోస్టర్ను వైయస్ఆర్సీపీ నేతలు విడుదల చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రులు జోగి రమేష్, అంబటి రాంబాబు, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, విద్యార్థి విభాగం నేతలు పానుగంటి చైతన్య, రవిచంద్ర సహా పలువురు నేతలు పోస్టర్ని రిలీజ్ చేశారు. అంబటి రాంబాబు. మాజీ మంత్రి ‘ఫీజు పోరు’ కార్యక్రమంలో భాగంగా, ఫిబ్రవరి 5న రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రంలో విద్యార్ధులు, వారి తల్లిదండ్రులతో కలిసి వైయస్ఆర్సీపీ నేతలు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు వెళ్ళి కలెక్టర్లకు డిమాండ్ పత్రాలు ఇవ్వబోతున్నారు. కూటమి ప్రభుత్వం విద్యాదీవెన కింద రూ.2,800 కోట్లు, వసతిదీవెన కింద రూ.1100 కోట్ల స్కాలర్షిప్.. రెండూ కలిపి దాదాపు రూ.3900 కోట్లు బకాయి పడింది. దీంతో కొన్ని చోట్ల కాలేజీల యాజమాన్యాలు విద్యార్ధులను క్లాస్లకు రానివ్వడం లేదు, మరికొన్ని చోట్ల సర్టిఫికేట్లు కూడా ఇవ్వడం లేదు. పేద విద్యార్ధులు చదువులు మానుకుని కూలీనాలి చేసుకోవాల్సిన పరిస్థితిని కల్పించారు. ప్రతి పేద విద్యార్ధి ప్రపంచస్థాయిలో అవకాశాలకు పోటీ పడాలని ఆనాడు సీఎంగా వైయస్ జగన్ భావిస్తే, నేడు కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు విద్యార్ధుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్నారు. ఆనాడు స్వర్గీయ వైయస్ రాజశేఖరరెడ్డిగారు పక్కాగా ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేశారు. నిరుపేద కుటుంబాలకు వారి పిల్లల ఫీజులు భారం కాకూడదనే మంచి ఉద్దేశంతో ఈ పథకానికి రూపకల్పన చేశారు. ఆ తర్వాత జగన్గారు, ఫీజు రీయింబర్స్మెంట్ను మరింత పటిష్టంగా 2019లో చంద్రబాబు ప్రభుత్వం రూ.2800 కోట్లు బకాయిలు పెట్టి దిగిపోయారు. సీఎంగా జగన్గారు ఆ బకాయిలు చెల్లించారు. జగన్గారి కంటే ఇంకా ఎక్కువగా మేలు చేస్తామంటూ గత ఎన్నికల్లో ప్రజలను నమ్మించిన కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చాయి. తీరా గద్దెనెక్కిన తరువాత విద్యార్ధుల ఉసురు పోసుకుంటున్నారు. ప్రతిపక్షంగా వైయస్ఆర్ సీపీ ఈ అన్యాయాన్ని చూస్తూ ఊరుకోదు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వ మెడలు వంచి విద్యార్ధులకు న్యాయం జరిగేలా పోరు కొనసాగిస్తాం. విద్యాశాఖ మంత్రి లోకేష్ ఇప్పటికైనా కళ్ళు తెరిచి విద్యార్ధులను ఆదుకునేందుకు ఫీజు బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఫిబ్రవరి 5వ తేదీ లోగా ఈ మొత్తం బకాయిలను చెల్లించకపోతే తీవ్ర పరిణామాలను ఈ ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పటికే ఇచ్చిన హామీలను ఎగ్గోట్టేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న దిగజారుడు రాజకీయాలను చూసి ప్రజలు ఈసడించుకుంటున్నారు. చంద్రబాబును 420 అంటే తెలుగుదేశం కార్యకర్తలు గావుకేకలు పెట్టారు. కానీ విద్యార్ధుల ఫీజులను విడుదల చేయకుండా వారిని మోసం చేస్తూ ఆయన చేస్తున్నది 420 కార్యక్రమం కాదా? అందుకే దీన్ని ఇప్పటికైనా సరి చేసుకోవాలి. జోగి రమేష్, మాజీ మంత్రి: – ఫిబ్రవరి 5వ తేదీన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్ధుల పక్షాన ఫీజు పోరు కార్యక్రమాన్ని చేపడుతోంది. అన్ని జిల్లాల్లోనూ కలెక్టర్లను కలిసి విద్యార్ధులు, వారి తల్లిదండ్రులను కలుపుకుని ఫీజురీయింబర్స్మెంట్పై వినతిపత్రాలు సమర్పించనుంది. విద్యాదీవెన, వసతిదీవెన బకాయిలు చెల్లించకుండా విద్యార్ధులను నట్టేట ముంచే కార్యక్రమం కూటమి ప్రభుత్వం చేస్తోంది. ఫీజులు చెల్లించలేదని విద్యార్ధులను పలు విద్యాసంస్థలు గేటు బయట, తరగతి గదల్లో నిలబెడుతున్నాయి. కొన్ని లక్షలమంది విద్యార్ధులు అవస్థలు పడుతున్నారు. చంద్రబాబు మాటలు నమ్మి కూటమి పార్టీలకు ఓట్లు వేసి ఈరోజు తమ పిల్లలు అన్యాయమై పోయారంటూ తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. వైయస్ జగన్ గారి పిలుపుమేరకు వైయస్ఆర్ సీపీ శ్రేణులు విద్యార్ధుల పక్షాన ఫీజు పోరు కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెడుతున్నారు. వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ మంత్రి: గతంలో స్వర్గీయ వైయస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకం దేశంలోని పలు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. సీఎంగా వైయస్ జగన్ గారు ఈ రాష్ట్రంలోని విద్యార్ధులకు బంగారు భవిష్యత్తు ఉండాలని అనుక్షణం తపించారు. పేద విద్యార్ధులు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందుకునేందుకు వీలుగా వైయస్ జగన్ గారు సీఎం అయిన తరువాత విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. నాడు–నేడు కార్యక్రమంలో దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు విద్యాసంస్థలకు దీటుగా తీర్చిదిద్దారు. జగనన్న గోరుముద్ద పేరుతో పౌష్టికాహారం అందించారు. విద్యా కానుక కింద పిల్లలకు నాణ్యమైన స్కూల్ బ్యాగ్స్, బూట్లు, పుస్తకాలను అందించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల ఒక ప్రభుత్వ స్కూల్ కు వెళ్ళి ఇది ప్రభుత్వ స్కూలా, ప్రైవేటు స్కూలా అంటూ ఆశ్చర్యపోయారు. అటువంటి మంచి సంస్కరణలతో ఈ రాష్ట్రంలో విద్యాప్రమాణాలను గత వైయస్సార్సీపీ ప్రభుత్వం ప్రయత్నించింది. కూటమి ప్రభుత్వం వచ్చాక, మిగతా అన్ని రంగాల మాదిరిగానే విద్యా రంగాన్ని కూడా నాశనం చేస్తోంది. కార్యక్రమంలో మాజీ మంత్రులు అంబటి రాంబాబు, వెల్లంపల్లి శ్రీనివాస్, జోగి రమేష్, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు అంకంరెడ్డి నారాయణమూర్తి, మస్తాన్వలీ, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కాకుమాను రాజశేఖర్, పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య, పార్టీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర, పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కె.కనకారావు, పార్టీ నాయకుడు డాక్టర్ మెహబూబ్తో పాటు, పలువురు నాయకులు పాల్గొన్నారు.