సచివాలయం: పోలింగ్, ఆ తరువాతి రోజు ఎవరైతే చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడ్డారో వారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్ను కోరింది. టీడీపీ బూత్ క్యాప్చరింగ్, రిగ్గింగ్, హింసాత్మక ఘటనలపై ఎన్నికల కమిషన్ ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాకు వైయస్ఆర్ సీపీ ఫిర్యాదు చేసింది. అన్ని అంశాలపై సమగ్ర విచారణ చేయాలని వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు కాసు మహేష్ రెడ్డి, మల్లాది విష్ణు, శాసనమండలి విప్ లేళ్ల అప్పిరెడ్డి కోరారు. ఈ మేరకు ఈసీకి వినతిపత్రం అందజేశారు. మాచర్లలో పాల్వాయిగేట్, తుమ్మురుకోట, చింతపల్లి, ఒప్పిచర్ల, జెట్టి పాలెం, వెల్దుర్తి ప్రాంతాలలో జరిగిన అల్లర్లు, విధ్వంసకాండపై ఈసీకి ఆరోజే ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ముఖ్యంగా టీడీపీకి అనుకూలంగా ఉన్న పోలింగ్ బూత్ లలో పోలీస్ వారిని అసలు నియమించకుండా వైయస్సార్ సీపీకి అనుకూలంగా ఉన్న పోలింగ్ బూత్ లలో డీఎస్పీ స్థాయి అధికారులను నియమించి ఓటర్లను ఓట్లు స్వేచ్ఛగా ఓటువేయకుండా పోలీసులతో భయభ్రాంతులకు గురిచేశారు. మాచర్ల వైయస్సార్ సీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎప్పటికప్పుడు ఈ ఘటనలపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినా బేఖాతరు చేశారు. గొడవలు జరుగుతున్న ప్రాంతానికి పోలీసులను పంపలేదు. దానివల్ల హింసకు ప్రజ్వరిల్లింది. మాచర్ల హైపర్ సెన్సిటివ్ నియోజకవర్గంగా గుర్తించి సెంట్రల్ ఈసీ ఆదేశానుసారం 100 శాతం వెబ్ క్యాస్టింగ్ ఏర్పాటుచేశారు. ఆ వీడియో ఫుటేజ్లను అన్నింటిని చూసి అనంతరం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా వీడియో ఫుటేజీల ఆధారంగా టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి, ఇతర అసాంఘిక శక్తులందరిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల సందర్బంగా తెలుగుదేశం పార్టీ చేసిన అరాచకాలు, హింసపై ఈసీ సరైన రీతిలో స్పందించకపోతే హైకోర్టు, సుప్రీం కోర్టు వరకు వెళ్లి న్యాయ పోరాటం చేస్తామని ప్రకటించారు. పోలింగ్ నాడు చంద్రబాబు రాష్ట్రంలో విధ్వంసం సృష్టించారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలపై తెలుగుదేశం పార్టీ నేతల ఆధ్వర్యంలో దాడులు జరిగాయన్నారు. పోలింగ్ రోజు నుంచి టీడీపీ చేస్తున్న అరాచకాలపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. తెలుగుదేశం పార్టీ పోలింగ్ బూత్ లలో రిగ్గింగ్ కు పాల్పడిందని దాదాపు 60కి పైగా పోలింగ్ స్టేషన్ లలో రీపోలింగ్ జరపాలని కోరామన్నారు. వెబ్ కెమెరాల ఫుటేజీ ఆధారంగా విచారణ జరిపి రీపోలింగ్ జరపాలని ఏయే ఊర్లలో హింసాత్మక సంఘటనలు జరిగాయి, బూత్ లను టీడీపీ కబ్జా చేసి రిగ్గింగ్ చేసింది తగిన ఆధారాలను ముఖేష్ కుమార్ మీనాకు అందించడం జరిగిందన్నారు. వైయస్ఆర్ సీపీకి ఓటు వేసిన వారిని టీడీపీ వాళ్ళు కొట్టి చంపాలని చూసినా ఆ విషయం తెలిసి తాము ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పోలీసులు ఏమాత్రం స్పందించలేదన్నారు. ఎన్నికలకు వారం రోజుల ముందు పోలీస్ సిబ్బందిని ఎస్ఐ, సీఐలను కొన్నిచోట్ల మార్చారని తెలియచేశారు. దాని వల్లనే హింస చెలరేగిందని ఆరోపించారు. ఈ హింసకి బీజేపీ, టీడీపీ, ఈసీ ఎవరు బాధ్యత వహిస్తారు అని ప్రశ్నిస్తున్నామన్నారు. ఎన్ని చోట్ల టీడీపీ రిగ్గింగ్ చేసినా ప్రజలు మాత్రం వైయస్ జగన్ ని తిరిగి గెలిపించాలని నిర్ణయించుకున్నారన్నారు. మాచర్లలో తుమ్మురుకోట, వెల్దుర్తి వంటి చోట్ల టీడీపీ రిగ్గింగ్ చేసిందనేది ఆరోజు ఆయా పోలింగ్ బూత్ ల వద్ద వీడియో ఫుటేజ్ చూస్తే తెలిసిపోతుందన్నారు. టీడీపీ రిగ్గింగ్ చేసినా ఈసీ చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల గురించి ఎన్నికలకు ముందే ఈసీ దృష్టికి తీసుకుని వెళ్ళామన్నారు. ఆయా ప్రాంతాలలో ఓటర్లు సురక్షితంగా ఓటు వేసేలా భద్రత కల్పించాలని కోరామని తెలియచేశారు. అయినా పోలీసులు, ఎన్నికల అధికారులు ఎటువంటి భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్లనే తెలుగుదేశం పార్టీ దౌర్జన్యం, దాడులు, హింసకు పాల్పడిందన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి అధికారులను మార్చమని ఒత్తిడి తెచ్చారని, ఈసీ కనీస విచారణ చేయకుండా అధికారులను నియమించిన నేపథ్యంలోనే హింస జరిగిందని వివరించారు. కార్యక్రమంలో పార్టీ లీగల్ సెల్ సభ్యుడు శ్రీనివాసరెడ్డి, విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య తదితరులు పాల్గొన్నారు.