విశాఖపట్నం: కురుపాం గిరిజన గురుకుల పాఠశాలలో జాండిస్ తో ఇద్దరు బాలికలు మృతి ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు వైయస్.జగన్ మండిపడ్డారు. విశాఖ కింగ్ జార్జ్ ఆసుపత్రిలో జాండిస్ తో చికిత్స పొందుతున్న విద్యార్థినులు పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గిరిజన విద్యార్ధుల సంక్షేమాన్ని ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సురక్షిత తాగునీరు లేకపోవడం వల్లే ఒకే స్కూళ్లో 170 మంది కలుషిత నీరు తాగడం వల్ల జాండిస్ బారిన పడితే అవగాహన లేని మంత్రులు వాటర్ కంటామినేషన్ కాదని అబద్దాలు చెప్పడం పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మృతి చెందిన విద్యార్థినుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహాం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మరోవైపు వైయస్ఆర్సీపీ తరపున వారికి రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఇంకా శ్రీ వైయస్.జగన్ ఏమన్నారంటే... కేజీహెచ్ లో జాండిస్ తో 65 మంది విద్యార్థినులు చికిత్స పొందుతున్నారు. వీళ్లంతా కురుపాం లోని ఒకే స్కూల్ నుంచి కేజీహెచ్ కు వచ్చారు. కురుపాం నుంచి 200 కిలోమీటర్ల దూరంలో నుంచి విశాఖ కేజీహెచ్ కు వచ్చారంటే విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితి ఎంత విషమంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అందరూ 5, 6 తరగతులు చదువుతున్న చిన్న పిల్లలు జాండిస్ తో బాధపడుతున్నారు. విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు స్కూళ్లో తాగునీటి సమస్య ఉందని చెబుతున్నారు. వైద్యులు సైతం నీరు కలుషితం వల్లే జాండిస్ వచ్చిందని చెబుతున్నారు. స్కూళ్లో ఆర్వో ప్లాంట్ పనిచేయడం లేదు కాబట్టే నీరు కలుషితం అయింది. అది కూడా మలమూత్రాలతో నీరు కలుషితం కావడం వల్లే.. పిల్లలకు కామెర్లు సోకాయి. మొత్తం 170 మందికి ఒకే స్కూల్ పిల్లలకు కామెర్లు వస్తే.. ప్రభుత్వం, మంత్రులు దాన్ని కవర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారే తప్ప... పరిష్కారం వెదకడం లేదు. ప్రభుత్వ వసతి గృహంలో కలుషిత నీటి వలన 170 మందికి కామెర్లు వస్తే.. వీరిలో 65 మంది ఆరోగ్య పరిస్థితి విషమించడంతో విశాఖ కేజీహెచ్ లో చికిత్స పొందుతున్నారు. ఇద్దరు విద్యార్థినులు చనిపోయారు. కామెర్లతో చనిపోయిన ఇద్దరు విద్యార్థినుల కుటుంబాలకు కనీసం రూ.25 లక్షలు పరిహారం చెల్లించాలి. అంతే కాకుండా కామెర్లు సోకిన మిగిలిన పిల్లల బాధ్యత ప్రభుత్వమే తీసుకుని ఒక్కోక్కరికి రూ.1లక్ష చొప్పున ఇవ్వాలి. అదే విధంగా స్కూళ్లో ఆర్వో ప్లాంటును తక్షణమే రిపేరు చేయించాలి. బాత్రూమ్ లు, శానిటేషన్ పనులు పూర్తి చేయాలి. ఇది ముమ్మూటికీ ప్రభుత్వ తప్పిదమే. తక్షణమే ప్రభుత్వం కురుపాం స్కూళ్లో సమస్యలన్నింటినీ పరిష్కరించి ప్రభుత్వం తమ తప్పిదాలకు ప్రాయశ్చితం చేసుకోకపోతే దేవుడు కూడా వీళ్లని క్షమించడు. గిరిజన పిల్లల సంక్షేమాన్ని ఈ ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలి. జాండిస్ బారిన పడిన పిల్లలకు కచ్చితంగా పరిహారం ఇప్పించే కార్యక్రమంలో భాగంగా అవసరమైతే వైయస్ఆర్సీపీ కోర్టును కూడా ఆశ్రయిస్తుంది. ● ఈ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందంటే... కేజీహెచ్ కు వచ్చిన హోమ్ మంత్రి నీరు కలుషితం కాలేదని మాట్లాడుతున్నారు అంటే.. అసలు జాండిస్ ఎలా వస్తుందన్న అవగాహన కూడా ఆమెకు లేదు. జాండీస్ వాటర్ కంటామినేషన్ వల్లే జాండీస్ వస్తుంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు ఒకే స్కూల్ నుంచి 170 మంది వచ్చారు. 65 మంది ఇదే ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. మరి అది వాటర్ కంటామినేషన్ వల్ల కాకుండా ఎలా జరిగింది..? నోరు తెరిస్తే అబద్ధాలు ఆడడం. తప్పు జరిగింది.. ఒప్పుకోమని చెప్పండి. ఒప్పుకొని దానికి ప్రాయశ్చితం ఏమేమి చేయాలని చేయమని చెప్పండి. ఇద్దరు పిల్లలు చనిపోయారు. ఆ తల్లులకు తోడుగా ఉండే కార్యక్రమం చేయాలి. రూ.25 లక్షల చొప్పున ఇచ్చే కార్యక్రమం చేయాలి. స్కూళ్లలో, హాస్టళ్లలో మినరల్ వాటర్ ప్లాంట్ రిపేర్ చేయించండి. బాత్రూమ్లు రిపేరు చేయించాలి. శానిటేషన్ పనులన్నీ పూర్తి చేయాలి. వసతుల మీద ధ్యాస పెట్టండి. పిల్లలు బతికే పరిస్థితి, చదివే పరిస్థితి కల్పించండి. పార్వతీపురంలో మెడికల్ కాలేజీ, ఆసుపత్రి నిర్మాణం నిలిపివేయకుండా... పూర్తి చేసి ఉంటే ఇవాళ వీరందరినీ ఆ ఆసుపత్రి కాపాడి ఉండేది. 200 కిలోమీటర్లు దూరం ప్రయాణించి ఇంత దూరం రావాల్సిన అవసరం కూడా ఉండేది కాదు. ఈ ప్రభుత్వం విద్యార్ధుల ప్రాణాలతో చెలగాట మాడుతూ.. నీళ్లు కంటామినేషన్ లేదని అబద్దాలు చెబుతూ దుష్ప్రచారం చేయడానికి కొద్దిగానైనా సిగ్గుండాలి. జాండిస్ తో ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు చిన్నారుల కటుంబాలకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున తలో రూ.5 లక్షలు పరిహారం చెల్లిస్తాం. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మిగిలిన విద్యార్ధినులకు కూడా పార్టీ తరపున అండగా ఉంటాం. మరోవైపు న్యాయపరంగా కూడా వీరికి అండగా ఉండే కార్యక్రమం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.