రైతులను రౌడీలుగా చూపిస్తూ కేసులా?

చంద్రబాబుపై వైయ‌స్‌ జగన్‌ ఫైర్‌

తాడేప‌ల్లి: ప్రకాశం జిల్లా పొదిలి పర్యటనలో నిరసనల పేరిట ఉద్రిక్తతలకు కారణమైనవాళ్లను వదిలేసి.. అమాయక ప్రజలపై, రైతులపైనా కేసులు పెట్టడాన్ని వైయ‌స్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి(YS Jagan Mohan Reddy) తీవ్రంగా ఖండించారు. రైతుల సమస్యను డైవర్ట్‌ చేయడానికి చంద్రబాబు సర్కార్‌ చేయిస్తున్న మరో దుర్మార్గమని ఎక్స్‌లో మండిపడ్డారాయన. 

చంద్రబాబు గారూ.. పొగాకు పంటకు కనీస మద్దతు ధరలు లభించక రైతులు అన్యాయానికి గురవుతుంటే, వారిని పరామర్శించి భరోసా ఇవ్వడానికి ప్రకాశం జిల్లా పొదిలి నేను వెళ్తే, ఆ కార్యక్రమాన్ని డైవర్ట్‌ చేయడానికి మీరు కుట్ర చేయడం భావ్యమా?. రైతులను పరామర్శించే ఈ కార్యక్రమానికి సంఘీభావంగా దాదాపు 40 వేలమంది రైతులు, ప్రజలు తరలివస్తే, మేం వెళ్తున్న మార్గంలో మీరు 40 మంది టీడీపీ కార్యకర్తలను పెట్టి, వారిని ఉసిగొల్పి, రాళ్లు విసిరి గలాటా చేయించారు. 

కాని ప్రజలు, రైతులు ఆ పన్నాగాన్ని అర్థం చేసుకుని అత్యంత సంయమనంతో వ్యవహరించారు. హింసను సృష్టించడానికి మీరు పంపిన ఆ 40 మంది చేసిన దుశ్చర్యలపైన.. అక్కడున్న 40 వేల మంది ప్రజలు, రైతులు ప్రతిస్పందించి ఉంటే ఏం జరిగి ఉండేది?. రైతుల సమస్యలపై గొంతెత్తితే దాన్ని డైవర్ట్‌ చేయడానికి మీరు ఇలా చేయించడం దుర్మార్గం కాదా?..  పైగా ఉల్టా రాళ్లు మీవాళ్లు విసిరితే, మీరు ఉసిగొల్పిన మీ కార్యకర్తలు గొడవలు చేసే ప్రయత్నం చేస్తే, అన్యాయంగా రైతులపై, ప్రజలపై కేసులు పెడతారా?. ఆ కార్యక్రమానికి వచ్చిన రైతులను, ప్రజలను రౌడీలుగా అభివర్ణించడం మీ దిగజారుడుతనం కాదా చంద్రబాబు గారూ?. రోమ్‌ చక్రవర్తి ఫిడేలు వాయించినట్టుగా…, రైతుల సమస్యలను పట్టించుకోకుండా, తిరిగి వారిపైనే ఎదురు కేసులు పెట్టడం మీకు మాత్రమే చెల్లుతుంది’’ అని వైయ‌స్‌ జగన్‌ తన పోస్టులో పేర్కొన్నారు.

Back to Top